జగన్కు ప్రకటన ముప్పు: చంద్రబాబు తలుచుకంటే వైసిపి ఖాళీ?
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు తీవ్రమైన కుదుపునకు గురయ్యాయి. టిడిపి శాసనసభ్యులు తమతో టచ్లో ఉన్నారని, వారి పేర్లు ఇప్పుడే చెప్పబోమని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ చేసిన ప్రకటనను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా తీసుకున్నట్లు అర్థమవుతోంది. తమకు 67 మంది శాసనసభ్యులు ఉన్నారని, మరో 21 మంది వస్తే చంద్రబాబు ప్రభుత్వం పడిపోతుందని కూడా జగన్ అన్నారు.
తాను చేసిన ప్రకటనే జగన్కు ముప్పు తెచ్చి పెట్టినట్లు భావిస్తున్నారు. జగన్ ప్రకటనతో తీవ్రంగా ఆగ్రహం చెందిన చంద్రబాబు రంగంలోకి దిగి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులను పార్టీలోకి తీసుకునే ప్రక్రియను వేగవంతం చేసినట్లు భావిస్తున్నారు. కర్నూలు జిల్లాలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి అత్యంత కీలకమైన శాసనసభ్యులు భూమా నాగిరెడ్డిని, అఖిలప్రియను పార్టీలో చేర్చుకోవడం ద్వారా జగన్ను ఇబ్బందులకు గురి చేయడం చంద్రబాబు ఆలోచనగా చెబుతున్నారు.
చంద్రబాబు తలుచుకుంటే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఖాళీ అవుతుందని ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప శనివారం అన్నారు. వైసిపి ఎమ్మెల్యేలు తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారని, చాలా మంది తమ టీడిపిలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన చెప్పారు. దీన్నిబట్టి వచ్చే ఎన్నికల నాటికైనా సరే వైయస్సార్ కాంగ్రెసు పార్టీని ఖాళీ చేయాలనే వ్యూహంతో చంద్రబాబు పనిచేస్తున్నారని భావించవచ్చు.
భూమా నాగిరెడ్డి, అఖిలప్రియ టిడిపిలో చేరితే అది జగన్కు నైతికంగా కూడా దెబ్బనే అవుతుంది. కర్నూలు జిల్లాలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి తీవ్రమైన నష్టం వాటిల్లుతుంది. పైగా, చంద్రబాబు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ రాయలసీమలో ఒక నాయకుడు తమ పార్టీలోకి వస్తే మరో నాయకుడు అవతలి పార్టీలో చేరే సంప్రదాయాన్ని దెబ్బ తీస్తున్నారు.
ఇతర నాయకులను ఒప్పిస్తూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులను పార్టీలో చేర్చుకుంటున్నారు. భూమా నాగిరెడ్డి పార్టీలో చేరడం వల్ల ఇతర నాయకులు అసంతృప్తికి, అభద్రతా భావానికి గురి కాకుండా ఉండడానికే ఆయన కర్నూలు జిల్లా పార్టీ నేతలతో సమావేశమవుతున్నారు.