అమిత్షాతో బాబు భేటీ: కాళ్లు మొక్కాలని సదస్సులో..
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా శుక్రవారం ఉదయం భేటీ అయ్యారు. వీరిద్దరు తాజా రాజకీయ పరిస్థితుల పైన తమ సమావేశంలో చర్చించారని సమాచారం. ఇద్దరు కలసి అల్పాహార విందులో పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులు, అందాల్సిన నిధులు త్వరితగతిన అందేలా సహకరించాలని ఈ సందర్భంగా అమిత్ షాను చంద్రబాబు కోరారు. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. తెలంగాణ టీడీపీ నేతలు పలువురు పాల్గొన్నారు.
కార్యకర్తల కాళ్లు మొక్కాలి: చంద్రబాబు
కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా ఏ గతి పట్టిందో అందరికీ తెలుసునని, తప్పు చేస్తే మనం కూడా మిగలమని, అవినీతిని దరి చేరనీయవద్దని, ప్రజలు, కార్యకర్తలకు అందుబాటులో ఉండాలని చంద్రబాబు గురువారం నాడు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో ఏర్పాటు చేసిన సదస్సులో అన్నారు. పార్టీకి, ప్రభుత్వానికి సమ ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలిపారు.
ఆయా అంశాలపై తొలుత పార్టీలో చర్చించాలని, క్షేత్రస్థాయిలో ఎక్కడికక్కడ సమావేశాలు ఏర్పాటు చేసుకొని సమీక్షించాలని, అక్కడ వ్యక్తమైన సూచననను ఆయా స్థాయిల్లో పరిగణలోకి తీసుకొని ప్రభుత్వం ముందుకు వెళ్లేలా చూస్తామని చంద్రబాబు నేతలకు చెప్పారు. నిర్ణయం పార్టీది, అమలు ప్రభుత్వానిది అవ్వాల్సి ఉందన్నారు.
మంత్రులు సరిగ్గా స్పందించడం లేదనే ఫిర్యాదుపై చంద్రబాబు నాయుడు స్పందిస్తూ.. మంత్రులు స్పందించాలని, ఎమ్మెల్యేలకూ ఆ బాధ్యత ఉందని, నియోజకవర్గాలను సొంత ఎస్టేట్గా భావించవద్దని, కార్యకర్తల కాళ్లు మొక్కాలని చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు.