చరిత్రహీనులుగా వైసీపీనేతలు; జగన్ మూడు ముక్కలాటకి హైకోర్టుతీర్పు చెంపపెట్టు: చంద్రబాబు, లోకేష్
మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు పిటిషన్లపై ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నాం అని ఇప్పటికే తెలుగుదేశం పార్టీ నేతలు పేర్కొన్న విషయం తెలిసిందే. రాజధానిగా అమరావతినే కొనసాగించాలి అని రాజధాని రైతులకు మద్దతు గా పోరాటం చేసిన టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు హైకోర్టు తాజా తీర్పును స్వాగతించారు.

రాజధాని రైతుల సంకల్పమే గెలిచింది : చంద్రబాబు
రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు 807 రోజులుగా ఉద్యమ బాట పట్టారని, రైతులు, మహిళలు ఆందోళన చేశారని చంద్రబాబు గుర్తు చేశారు. గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన రాజధాని అమరావతి పై ఎన్నో కుట్రలు చేశారంటూ మండిపడ్డారు. అమరావతిని స్మశానం అని అన్నారని చంద్రబాబు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. రాజధాని రైతులు ఎంతో పవిత్రంగా పాదయాత్ర చేశారని, రాజధానిగా అమరావతినే కొనసాగించాలి అన్న వారి సంకల్పమే ఈరోజు గెలిచిందని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుందని మరోమారు రుజువైంది అని చంద్రబాబు వెల్లడించారు.

ఈ విజయం ప్రజా రాజధానిది, ఐదు కోట్ల ఆంధ్రులది
ఎన్ని అడ్డంకులు సృష్టించినా రైతులు మాత్రం పోరాటం చేయటం ఆపలేదని, రైతుల పోరాటపటిమను చంద్రబాబు కొనియాడారు. హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఈ విజయం ప్రజా రాజధానిది అని, ఐదు కోట్ల ఆంధ్రులది అని చంద్రబాబు చెప్పుకొచ్చారు. అమరావతి అభివృద్ధి చెందితే విద్యార్థులు విదేశాలకు వెళ్లేవారు కాదని చంద్రబాబు అభిప్రాయం వ్యక్తం చేశారు. రాజధాని కోసం అలుపెరగని పోరాటం చేస్తున్న రైతులు, మహిళలను చంద్రబాబు అభినందించారు. ప్రపంచంలో ఎక్కడా జరగని విధంగా 99% ఏకగ్రీవంగా ల్యాండ్ పూలింగ్ కు భూములు ఇచ్చిన ప్రాంతం అమరావతి అని చంద్రబాబు పేర్కొన్నారు.

రాజధాని ప్రాంతాన్ని ఎడారిగా చిత్రీకరించే యత్నం .. వైసీపీ నేతలు దుర్మార్గులు
ఎలాంటి కోర్టు కేసులు, వివాదాలు లేకుండా రైతులు 33 వేల ఎకరాల భూములను రాజధాని అమరావతి కోసం ఇచ్చారని గుర్తు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సింగపూర్ నుంచి మంత్రులు భూమి పూజకు వచ్చారని గుర్తు చేసిన చంద్రబాబు రాజధాని ప్రాంతాన్ని ఎడారిగా చిత్రీకరించే ప్రయత్నం వైసీపీ నేతలు చేశారని మండిపడ్డారు. రాజధాని అమరావతి ముంపుకు గురవుతుందని దుష్ప్రచారం చేశారని వైసీపీ నేతలు ఎంత దుర్మార్గులో అర్థం చేసుకోవాలంటూ ఆయన పేర్కొన్నారు.

చరిత్ర హీనులుగా వైసీపీ నేతలు మిగిలిపోతారు
అమరావతి అభివృద్ధిని అడ్డుకున్న వైసీపీ నేతలు చరిత్రహీనులుగా మిగిలిపోతారని చంద్రబాబు విమర్శించారు. రాష్ట్రాన్ని సర్వ నాశనం చేసే అధికారం ఎవరిచ్చారు అంటూ మండిపడ్డారు. మీ రాజధాని ఏది అడిగితే పిల్లలు చెప్పుకోలేని పరిస్థితి ఉందని చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అమరావతిని అభివృద్ధి చేసి ఉంటే పెద్ద ఎత్తున పరిశ్రమలు వచ్చేవని, పెద్దపెద్ద కార్పొరేట్ ఆస్పత్రులు విజయవాడలోనే ఏర్పాటు అయ్యేవని, కరోనా సమయంలో హైదరాబాద్ కు వెళ్లే బాధలు తప్పేవని చంద్రబాబు పేర్కొన్నారు.

జగన్ మూడు ముక్కలాటకి హైకోర్టు తీర్పు చెంపపెట్టు: లోకేష్
ఇక ఇదే సమయంలో తాజా హైకోర్టు తీర్పుపై నారా లోకేష్ స్పందించారు. ఇది రైతుల విజయం, ఇది మహిళల విజయం, ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల విజయం అంటూ ఆయన సోషల్ మీడియా వేదికగా మూడు రాజధానులు, సీఆర్డీఏ పై కోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతించారు . వైసీపీ సర్కారు విద్వేషపు ఆలోచనలతో తలపెట్టిన మూడు ముక్కలాటకి హైకోర్టు తీర్పు చెంపపెట్టు అని నారా లోకేష్ వ్యాఖ్యానించారు. ప్రజారాజధాని అమరావతి కోసం భూములు త్యాగం చేసిన రైతుల విజయం ఇది అని లోకేష్ పేర్కొన్నారు.
Recommended Video

అమరావతి అజరామరం.. ఉద్వేగంగా లోకేష్
అభివృద్ధి వికేంద్రీకరణ ముద్దు...రాజధాని వికేంద్రీకరణ వద్దు అనే నినాదంతో అమరావతి ప్రాంత సకల జనులూ సాగించిన నిస్వార్థ ఉద్యమ ఫలితం ఇది అని లోకేష్ అభిప్రాయం వ్యక్తం చేశారు. సర్కారు అరెస్టులు, నిర్బంధాలు, దాడులు ఎదురొడ్డి శాంతియుత ఉద్యమంతో విజయం సాధించిన రైతులు, మహిళలు, విద్యార్థులు, రైతు కూలీలు, మద్దతుగా నిలిచిన రాజకీయ పార్టీలకు ఉద్యమాభివందనాలు తెలుపుతున్నాను అన్నారు లోకేష్. అమరావతి అజరామరం అంటూ ఉద్వేగపూరితంగా వ్యాఖ్యలు చేశారు. కూల్చాలని, తరలించాలని దురాలోచనలు మానేసి న్యాయస్థానం ఆదేశాలతో అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తే చరిత్రలో మీకో పేజీ వుంటుంది అని లోకేష్ హితవుపలికారు. రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేయాలని లోకేష్ సూచించారు.












Click it and Unblock the Notifications