రాజధాని అమరావతి గ్రామాల్లో పండగ వాతావరణం
Chandrababu and Pawan Kalyan: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం.. పర్యావరణ పరిరక్షణ, ప్లాస్టిక్ వినియోగం నిషేధంపై దృష్టి సారించింది.
ఇందులో భాగంగా- ఈ ఏడాది కూడా వన మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడానికి చర్యలు తీసుకుంది. నేడు- రాజధాని అమరావతి పరిధిలోని అనంతవరంలో ఈ ఈవెంట్ ను నిర్వహించతలపెట్టింది చంద్రబాబు సర్కార్. దీనికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి.

ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏపీ ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఈ వనమహోత్సవాన్ని నిర్వహిస్తూ వస్తోంది. ఈ ఆనవాయితీని కొనసాగిస్తోంది. అనంతవరం ఎకో పార్క్ లో ఏర్పాటైన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హాజరు కానున్నారు. మొక్కలు నాటనున్నారు.
అనంతరం బహిరంగ సభను ఉద్దేశించి వారిద్దరూ ప్రసంగించనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను గుంటూరు జిల్లా ఇన్ ఛార్జ్ కలెక్టర్ భార్గవ తేజ, జిల్లా ఎస్పీ సతీష్ కుమార్, జిల్లా అదనపు ఎస్పీ (శాంతిభద్రతలు) రవికుమార్, ఆర్డీఓ శ్రీనివాసరావు, తుళ్లూరు డీఎస్పీ మురళీకృష్ణ పరిశీలించారు.
సభా ప్రాంగణంలో వీవీఐపీ, వీఐపీల కోసం ఏర్పాటు చేసిన స్టేజ్ నిర్మాణాన్ని, బ్యారికేడ్ ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించారు. వాహనాల రాకపోకలు సవ్యంగా సాగేలా చర్యలు తీసుకున్నారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ సహా పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు హాజరు కానున్నందున జిల్లా పోలీస్ అధికారులు పటిష్ట బందోబస్తును కల్పించారు.
రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఈ వన మహోత్సవం కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. మొక్కలు నాటడం వల్ల కలిగే ప్రయోజనాలు, ప్లాస్టిక్ వినియోగం వల్ల పర్యావరణానికి కలిగే దుష్పరిణామాలను వివరిస్తూ సదస్సులు, సమావేశాలు, ర్యాలీలు జరుగనున్నాయి.
ప్లాస్టిక్ వినియోగంపై గ్రామస్థాయిలో అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తారు అధికారులు. ప్రజల నుంచి సూచనలు, సలహాలను స్వీకరిస్తారు. వారి అభిప్రాయాలను సేకరిస్తారు. ఈ మేరకు దీనికి సంబంధించిన విధివిధానాలు ఖరారు చేస్తూ అటవీ మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.












Click it and Unblock the Notifications