ఎపి రాజధాని ఎలల్లు ఇవే: విభజనపై బాబు ఫైర్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని సరిహద్దులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఆయన శనివారంనాడు మీడియా సమావేశంలో ఈ మేరకు ప్రకటన చేసారు. విజయవాడ సమీపంలో రాజధానిని ఏర్పాటు చేస్తామని చెబుతూ వచ్చిన ఆయన నిర్దిష్టమైన ప్రాంతాన్ని ప్రకటించారు.
గుంటూరు ఆటోనగర్ నుంచి తూర్పు దిక్కుగా ప్రకాశం బ్యారేజీ నుంచి పదిన్నర కిలోమీటర్ల దూరం ఉంటుంది. పశ్చిమాన బోరుపాలెం నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు ఇది విస్తరించి ఉంటుంది. దక్షిణాన ఆటోనగర్ వై జంక్షన్ నుంచి 16 కిలోమీటర్ల పొడపునా 75 కిలోమీటర్ల రింగ్ రోడ్డు వరకు రాజధాని ఎల్లలుగా ఉంటాయని చంద్రబాబు వివరించారు.
ఇదిలావుంటే, శనివారంనాడు చంద్రబాబు రాజధాని గురించి హైదరాబాదులో మాట్లాడిన తర్వాత కడప జిల్లా రైల్వే కోడూరు మండలం ఓబనపల్లెలో జన్మభూమి కార్యక్రమాన్ని నిర్వహించారు. అభివృద్ధిలో భాగంగానే చదువుకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వ పథకాల పారదర్శక అమలు కోసమే ఆధార్ కార్డుతో అనుసంధానం చేస్తున్నట్లు తెలిపారు.
రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం ప్రణాళికాబద్ధమైన పథకాలను అమలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. పరిశ్రమల స్థాపన ద్వారా ఉపాధి, ఉద్యోగావకాశాలు పెంచుతామని ఆయన తెలిపారు. రాష్ట్ర విభజనలో హేతుబద్ధత లేదని చంద్రబాబు అన్నారు. రాజధాని లేదు, కట్టుబట్టలతో బయటకు పంపించారని ఆయన అన్నారు. ఆదాయం లేదు, అప్పులు మాత్రం మిగిలాయని ఆయన అన్నారు.

తాను కరెంట్ సమస్యను పరిష్కరించానని ఆయన చెప్పారు. వ్యవసాయానికి కరెంట్ సరఫరాను ఏడు గంటల నుంచి 9 గంటలకు పెంచుతామని ఆయన హామీ ఇచ్చారు. 9 గంటలు కూడా పగలే ఇచ్చేలా చూస్తానని ఆయన చెప్పారు. నాలుగు నెలల్లో విద్యుత్తు సరఫరాలో ఏమైనా లోపాలున్నాయా అని అడిగారు.
తాను కష్టపడేది తన కోసం తన కుటుంబం కోసం కాదని, పేదల కోసం, రైతుల కోసం తాను కష్టపడుతున్నానని ఆయన చెప్పారు. పేదవాడికి అండగా ఉండాలనేదే తమ లక్ష్యమని ఆయన చెప్పారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వేయి రూపాయల పింఛను ఇస్తున్నామని చంద్రబాబు చెప్పారు. ఏడు మిషన్లను పెట్టి రాష్ట్రాభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. వ్యవసాయాన్ని లాభసాటిగా చేయాలనేది తమ ఉద్దేశ్యమని చెప్పారు.
తాను రైతు కుటుంబం నుంచే వచ్చానని, వ్యవసాయాన్ని లాభసాటి చేసేవరకు విశ్రమించబోనని ఆయన చెప్పారు. రైతు రుణమాఫీ అర్హులందరికీ చేస్తామని ఆయన అన్నారు. కోడూరు, రాజంపేటలో, మొత్తంగానే కడప జిల్లాలో పండ్ల తోటలు ఎక్కువగా ఉన్నాయని, ఈ పంటలకు కూడా రుణమాఫీ చేయాలని అనుకున్నాను గానీ డబ్బులకు ఇబ్బందిగా ఉందని, అయితే కడప జిల్లాకు ప్రత్యేకంగా సహాయం చేసే ఆలోచన చేస్తానని అన్నారు.
మనుషులకే కాదు, పశువులకు కూడా మంచినీళ్లు అందించే కార్యక్రమాన్ని చేపడుతామని ఆయన చెప్పారు. ప్రతి గ్రామానికీ తారు రోడ్డు వేయిస్తానని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications