జగన్ టార్గెట్ గా చంద్రబాబు "బాదుడే బాదుడు" టూర్లు.. ఏ మేరకు సక్సెస్ అవుతారో?
టీడీపీ అధినేత చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి ప్రజాక్షేత్రంలో పాలనా వైఫల్యాలను ఎండగట్టాలని శతవిధాల ప్రయత్నిస్తున్నారు. నిత్యం వైసిపి వైఫల్యాలపై విరుచుకు పడుతున్న చంద్రబాబు ప్రజాక్షేత్రంలోకి వెళ్లి తెలుగుదేశం పార్టీకి ప్రజా మద్దతును కూడగట్టడానికి ఇప్పటి నుండే రంగంలోకి దిగుతున్నారు. మరో రెండేళ్లలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో జగన్ టార్గెట్ గా పావులు కదుపుతున్నారు.
చంద్రబాబు బాదుడే బాదుడు టూర్లు.. నేటి నుండే
చంద్రబాబు జగన్ సర్కార్ ను టార్గెట్ చేస్తూ చేస్తున్న బాదుడే బాదుడు టూర్లు నేటి నుండి ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో ఈ టూర్ల ద్వారా చంద్రబాబు జగన్ సర్కారు వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లటంలో ఏ మేరకు సక్సెస్ అవుతారు అన్నది చర్చనీయాంశంగా మారింది. మహానాడు కంటే ముందే పర్యటిస్తున్న చంద్రబాబు బుధవారం నాడు ఉత్తరాంధ్ర నుండి తన పర్యటన ప్రారంభిస్తున్నారు. పెరిగిన ధరలు, విపరీతంగా పెంచిన పన్నులకు నిరసనగా బాదుడే బాదుడు పేరుతో ఆందోళన కార్యక్రమాలను ఇప్పటికే తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
నేడు శ్రీకాకుళం జిల్లాలో చంద్రబాబు బాదుడే బాదుడు నిరసన
ఇక ఈ నిరసన కార్యక్రమాలలో చంద్రబాబు నేరుగా పాల్గొనడం కోసం మూడు ప్రాంతాలలోనూ పర్యటించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే బుధవారం నాడు మే 4వ తేదీ శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస నియోజకవర్గం జిల్లా దల్లావలస గ్రామం లో చంద్రబాబు పర్యటన సాగనుంది. ఇక 5వ తేదీ భీమిలి నియోజకవర్గం తాళ్లవలస గ్రామంలో, 6వ తేదీ ముమ్మడివరం నియోజకవర్గం కోరింగ గ్రామంలో చంద్రబాబు బాదుడే బాదుడు నిరసన కార్యక్రమంలో పాల్గొంటారు.
రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలకు శ్రీకారం చుట్టిన చంద్రబాబు .. ప్రభుత్వం సాగనిస్తుందా?
మహానాడు వరకు వివిధ జిల్లాల్లో పర్యటించి జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో పరిస్థితులను జనాలకు అర్థమయ్యేలా చెప్పడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే అనేక మార్లు చంద్రబాబు జిల్లాల పర్యటనలను వైసీపీ ప్రభుత్వం వివిధ రూపాలలో అడ్డుకుంది . గతంలో ప్రజా చైతన్య యాత్రలో భాగంగా విశాఖ కి వెళ్ళిన చంద్రబాబును విశాఖ ఎయిర్ పోర్ట్ లో నే అడ్డుకున్నారు . అప్పుడు చంద్రబాబు దాదాపు ఎయిర్ పోర్ట్ లోనే 9 గంటల పాటు నిరసన తెలిపారు. ఇప్పటికే అనేక మార్లు చంద్రబాబు పర్యటనకు అనుమతి ఇవ్వకుండా అడ్డుకునే ప్రయత్నం జరిగింది.
బాదుడే బాదుడు టూర్ లలో చంద్రబాబు సక్సెస్ అవుతారా?
మరి ఇప్పుడు మళ్లీ చంద్రబాబు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించాలని ప్రణాళికలు రచిస్తున్న వేళ చంద్రబాబు పర్యటనలో ఎటువంటి పరిణామాలు చోటుచేసుకుంటాయి అన్నది ఆసక్తిగా మారింది. ఇదిలా ఉంటే 2019లో ఎన్నికల్లో ఓడిపోయిన నాటినుండి చంద్రబాబు అధికార వైసీపీ ప్రభుత్వం పై తీవ్రస్థాయిలో విరుచుకు పడుతున్నా సరే ఇప్పటివరకు ప్రజల్లోకి వైసిపి ప్రజా వ్యతిరేక పాలనను బలంగా తీసుకెళ్లలేకపోయారు అన్న అభిప్రాయం ఉంది. ఇక మహానాడుకు ముందు చంద్రబాబు ప్రస్తుతం నిర్వహిస్తున్న పర్యటన ద్వారా ప్రజల్లో వైసీపీపై వ్యతిరేకతను, టిడిపిపై విశ్వాసాన్ని పెంచడంలో ఏ మేరకు సక్సెస్ అవుతారు ఉన్నది తెలియాల్సి ఉంది.