రష్యా సహకారం కోసం సీఎం, బాబు టాలెంట్ నచ్చిందని రష్యా గవర్నర్
అమరావతి: రష్యా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం బిజీబిజీగా గడిపారు. వివిధ ప్రావిన్స్లకు చెందిన ముఖ్య నేతలు, పారిశ్రామికవేత్తలతో వరుసగా సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలు స్థాపించాలని ఆహ్వానించారు.
పెట్టుబడులతో వచ్చేవారికి తమ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని చెప్పారు. రాజధాని అమరావతి నిర్మాణంలో పాలుపంచుకోవాలని కోరారు. ఏపీతో కలసి పనిచేసేందుకు, భారీ పరిశ్రమల స్థాపనకు చేయూతనిచ్చేందుకు చెలబిన్స్ ప్రావిన్స్ ముందుకొచ్చింది.
చెలబిన్స్ గవర్నర్ బోరిస్ దుబ్రొవ్స్కీతో చంద్రబాబు సమవేశమయ్యారు. ఇరుపక్షాల తరఫున చెరో ఐదుగురు సభ్యులతో త్వరలో ఒక వర్కింగ్ గ్రూపు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఐటీ సాంకేతిక పరిజ్ఞానాన్ని చెలబిన్స్కు అందిస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు.
అమరావతికి మాస్కో సహకారం
అమరావతిలో భవన నిర్మాణాలకు సహకరించేందుకు మాస్కో నగరపాలక సంస్థ ముందుకొచ్చింది. మాస్కో నగరపాలక సంస్థ విజ్ఞాన, పారిశ్రామిక విభాగాధిపతి ఒలెగ్ బొచరొవ్తో చంద్రబాబు సమావేశమయ్యారు. రాజధాని భవనాల నిర్మాణంలో సహకరిస్తామని, నూతన రాజధానిని ప్రపంచ స్థాయిలో నిర్మించేందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం తమ దగ్గర ఉందని బొచరొవ్ హామీ ఇచ్చారు.
అనంతరం, గాజ్ప్రోమ్ బ్యాంకు ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ యాంట్సెంటర్తో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. భారత విపణిలో ప్రవేశించేందుకు తాము ఆసక్తిగా ఉన్నట్లు యాంట్సెంటర్ తెలిపారు. యంత్ర సామాగ్రి తయారీ పరిశ్రమల్లో పెట్టుబడులు పెట్టేందుకు సంసిద్ధత తెలిపారు.
గవర్నర్ ప్రశంస
ఏపీ గురించి తెలుసుకున్నానని, పరిపాలనలో చంద్రబాబు ప్రతిభ, సాంకేతిక పరిజ్ఞానాలను వినియోగించే తీరు తమకు నచ్చిందని స్వెర్డ్లోవ్స్క్ గవర్నర్ ఎల్వీజీని కుయివషెవ్ కొనియాడారు. ప్రభుత్వ, ప్రయివేటు భాగస్వామ్యంలో రెండు రాష్ట్రాల సంయుక్త నిర్వహణలో ప్రాజెక్టులు చేపట్టేందుకు ఉన్న అవకాశాలను వినియోగించుకుంటామని చంద్రబాబుతో భేటీ సందర్భంగా తెలిపారు.