అడిగి రాళ్లు వేయించుకుంటారు: జగన్పై చంద్రబాబు
హైదరాబాద్: రాష్ట్రపతి దగ్గరకొస్తే ఒకాయన అడిగి మరీ రెండో వాళ్లతో రాళ్లు వేయించుకుంటున్నారని, ఆ రాళ్లతో నాల్గు ఓట్లు వస్తాయని భ్రమ పడుతున్నారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రపతిని కలిసి వస్తుండగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు జగన్ను తెలంగాణవాదులు అడ్డుకోవడంపై చంద్రబాబు ఆ విధంగా వ్యాఖ్యానించారు. కాంగ్రెస్లో కలిసి పోతామని ఒక పార్టీ పదే పదే ప్రకటిస్తుంటే ఆ పార్టీ ఎజెండా ప్రకారం కాంగ్రెస్ వ్యవహరించటం ఎంత వరకూ సమంజసమని ప్రశ్నించారు.
తెరాస, వైయస్సార్ కాంగ్రెసు చెరో ప్రాంతంలో, చెరో రకం ఉద్యమం నడుపుతున్నాయని, ఈ రెండు పార్టీలు నాలుగు సీట్లు తెచ్చుకుంటే తర్వాత వాటిని కలుపుకోవాలని కాంగ్రెస్ కాచుకొని కూర్చొందని ఆయన ఆరోపించారు. వైయస్సార్ కాంగ్రెసు సమైక్య ముసుగులో విభజన కోసం పోరాడుతోందని, ఎంత తొందరగా రాష్ట్రం విడిపోతే అవతలి పక్క తమకు అంత హాయిగా ఉంటుందని ఎదురు చూస్తోందని ధ్వజమెత్తారు.
రాష్ట్రంలో ఎవరితోనూ మాట్లాడకుండా ఢిల్లీలో గదిలో కూర్చొని రాష్ట్ర విభజన చేసేస్తారా అని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అడిగారు. దేశంలో ఎప్పుడైనా ఎక్కడ కూడా ఇలా జరగలేదని ఆయన అన్నారు. కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా తన కక్కుర్తి రాజకీయంతో రాష్ట్రాన్ని బలి చేస్తున్నారని ఆయన ఆరోపించారు. రాజ్యాంగ నిబంధనలను, సంప్రదాయాలను తుంగలో తొక్కి అడ్డగోలు వ్యవహారాలతో పచ్చటి రాష్ట్రంలో నిప్పులు పోస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.

రాష్ట్రపతికి ఇదే చెప్పానని, అన్నీ ఆలోచించి న్యాయం చేయాలని కోరానని ఆయన అన్నారు. బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో శీతాకాల విడిది చేసిన ప్రణబ్ ముఖర్జీని గురువారం రాత్రి ఆయన కలిశారు. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. రాజ్యాంగంలోని ఆర్టికల్-3ని కేంద్రం దుర్వినియోగం చేస్తోందని, రాజ్యాంగ పరిరక్షకునిగా ఆ దుర్వినియోగాన్ని అరికట్టాలని రాష్ట్రపతిని కోరానని ఆయన చెప్పారు.
బొమ్మై కేసులో కేంద్రం అధికారాన్ని సుప్రీం కోర్టు విపులంగా చర్చించిందని, కేంద్రానికి సర్వాధికారాలు లేవని, అలాంటి సర్వాధికారాలను ఆర్టికల్ 3, 4 కింద కేంద్రానికి ఇస్తే దుర్వినియోగం అవుతాయన్న భయంతోనే వాటిని రాష్ట్రపతికి ఇచ్చారని, కేంద్రం పంపిన వాటిని రాష్ట్రపతి కళ్లు మూసుకుని ఆమోదించటం కాదని, రాష్ట్రపతి తన విచక్షణ చూపాలని, రాజ్యాంగ విలువలు కాపాడాలని వ్యాఖ్యానించారు. విభజన ప్రక్రియపై చర్చ అసెంబ్లీలోనే మొదలు కావాలని, అసెంబ్లీ ఆమోదం ఉండాలని అంబేద్కర్ స్పష్టంగా చెప్పారని గుర్తు చేశారు.
అసెంబ్లీలో తీర్మానంతోనే విభజన ప్రక్రియ మొదలు పెడతామని కేంద్రం అనేకసార్లు ప్రకటించిందని, ఇప్పుడు ఆ అవసరం లేదని దబాయిస్తోందని మండిపడ్డారు. ఉత్తరప్రదేశ్, బీహార్ తదితర రాష్ట్రాల్లో విభజన బిల్లులపై ఆయా అసెంబ్లీలో ప్రతిపాదించిన సవరణలు వేటినీ కేంద్రం పట్టించుకోలేదని, పార్లమెంట్లో అసలు వాటికి సంబంధించిన చర్చే జరగలేదని తెలిపారు. కాంగ్రెస్, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస), వైయస్సార్ కాంగ్రెసు మూడూ కలిసి నాటకం ఆడుతున్నాయని, రాష్ట్రంలోని రెండు ప్రాంతాల్లో విద్వేషాలు రెచ్చగొడుతున్నాయని విమర్శించారు.
వైఎస్ రాజశేఖరరెడ్డి విభజనకు బీజం వేశారని, రాజ్యాంగం తెలియని జగన్ ఆర్టికల్-3ను రాజ్యాంగ సవరణ చేయాలంటూ రాష్ట్రాలు పట్టుకుని తిరుగుతున్నాడని ఎద్దేవా చేశారు. తండ్రీకొడుకుల వల్లే రాష్ట్ర విభజన చిచ్చు వచ్చిందని విమర్శించారు. కాగా, దొంగలు, హంతకులు, దోపిడీదారులు, దొంగ నోట్ల ముఠాల నేతలు, మనీ లాండరింగ్ బ్రోకర్లు, ఆర్థిక ఉగ్రవాదులకు కేరాఫ్ అడ్రస్గా వైయస్సార్ కాంగ్రెసు ఉందని ధ్వజమెత్తారు. తెలుగు సాంకేతిక నిపుణుల విభాగం (టీఎస్సెన్వీ) రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సూర్యదేవర అవినాష్ ఆధ్వర్యంలో 'ప్రతినిధి' పేరిట రూపొందించిన 2014 కేలండర్ను చంద్రబాబు గురువారం ఎన్టీఆర్ భవన్లో ఆవిష్కరించారు.












Click it and Unblock the Notifications