మారుతున్న రాజకీయం: పిఎసికి భూమా అందుకేనా, శిల్పాకు పిలుపు
విజయవాడ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. పలువురు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలో చేరనున్నారని నాలుగైదు రోజులుగా జోరుగా వార్తలు వస్తున్నాయి. తాజాగా, భూమా నాగిరెడ్డి చేరిక దాదాపు ఖాయమైందని తెలుస్తోంది.
పిఎసి భేటీకి హాజరైన భూమా నాగిరెడ్డి
పిఎసి చైర్మన్గా ఉన్న కర్నూలు జిల్లా నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి సోమవారం పిఎసి సమావేశానికి హాజరయ్యారు. గత కొద్దిరోజులుగా ఆయన పార్టీ (వైసిపి)కి దూరంగా ఉంటున్నారు. అలాంటి భూమా.. పిఎసి సమావేశానికి హాజరయ్యారు.
ఈ నేపథ్యంలో ఆయన టిడిపిలో చేరడం ఖాయమైపోయిందనే వాదనలు వినిపిస్తున్నాయి. వైసిపి నేతలు కూడా ఆయన టిడిపిలో చేరినట్లేనని మానసికంగా సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. తేలాల్సింది ఆయనకు ఏం మంత్రి పదవి ఇస్తారనే విషయమే అంటున్నారు. పిఎసి చైర్మన్గా భూమాకు ఇదే చివరి సమావేశం కావొచ్చంటున్నారు.
చంద్రబాబును కలిసేందుకు వచ్చిన శిల్పా సోదరులు
చంద్రబాబు సోమవారం ఉదయం కలెక్టర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ఇదే సమయంలో కర్నూలు జిల్లా నంద్యాల పార్టీ నేతలు శిల్పా సోదరులకు చంద్రబాబు నుంచి పిలుపు వచ్చింది.
ఉన్నపళంగా విజయవాడ రావాలని పార్టీ జిల్లా అధ్యక్షులు శిల్పా చక్రపాణి రెడ్డి, ఆయన సోదరుడు, మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డిలకు చంద్రబాబు కార్యాలయం నుంచి ఫోన్ వచ్చింది. దీంతో శిల్పా సోదరులు హుటాహుటిన విజయవాడ వచ్చారు. అయితే, తమను చంద్రబాబు ఎందుకు పిలిచారో తెలియదని వారు చెబుతున్నారు.
భూమా నాగిరెడ్డి చేరికపై చెప్పేందుకేనా?
వైసిపి ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి టిడిపి ఎక్కుతారనే వార్తలు జోరుగా వస్తున్నాయి. భూమా చేరిక దాదాపు ఖాయమైందంటున్నారు. ఈ నేపథ్యంలో వారికి ఈ సమాచారం ఇచ్చేందుకే వారిని రప్పించి ఉంటారని అంటున్నారు. శిల్పా సోదరులతో పాటు ఏపీ టిడిపి అధ్యక్షులు కళా వెంకట్రావు కూడా బెజవాడ వచ్చారు.
పిఎసి చైర్మన్ పదవికి రాజీనామా చేస్తారా?
ఐదారు రోజులుగా బయట ఎక్కువగా కనిపించకుండా పోయిన భూమా నాగిరెడ్డి సోమవారం బయటకు వచ్చారు. హైదరాబాదులోని అసెంబ్లీ ప్రాంగణంలో జరుగుతున్న ప్రజా పద్దుల కమిటీ (పీఏసీ) సమావేశానికి ఆయన చైర్మన్ హోదాలో హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన ఏమైనా మాట్లాడతారా? అన్న కోణంలో మీడియా ప్రతినిధులు అక్కడ ఆయన కోసం వేచి చూస్తున్నారు. పీఏసీ చైర్మన్ పదవికి భూమా రాజీనామా చేయనున్నారన్న వాదనలూ వినిపిస్తున్నాయి. కమిటీ చైర్మన్ హోదాలో ఉన్న ఆయన పలు కీలక ఫైళ్లను కమిటీకి అప్పజెప్పాల్సి ఉన్న నేపథ్యంలో ఆయన స్వయంగా సమావేశానికి హాజరయ్యారన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
సాయంత్రం చంద్రబాబును కలవనున్న ఆదినారాయణ, రామసుబ్బా రెడ్డి
కడప జిల్లాకు చెందిన వైసిపి జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సోమవారం సాయంత్రం లేదా రేపు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలవనున్నారు. అదే సమయంలో జమ్మలమడుగు టిడిపి సీనియర్ నేత రామసుబ్బా రెడ్డికి కూడా పిలుపు వచ్చింది. దీంతో రామసుబ్బా రెడ్డి అనుచరులతో బెజవాడ బయలుదేరారు.