హెలికాప్టర్లో సాంకేతిక లోపం: చంద్రబాబు సభలు రద్దు
ప్రకాశం: తను ప్రయాణించాల్సిన హెలికాప్టర్లో సాంకేతిక లోపం సంభవించడంతో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పాల్గొనాల్సిన మార్కాపురం, కందుకూరు సభలు రద్దయ్యాయి. కాగా, ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలో మంగళవారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. విజయవాడ నుంచి హెలికాప్టర్లో మధ్యాహ్నం 2గంటలకు దర్శి చేరుకున్న చంద్రబాబు క్లాక్ టవర్ వద్ద రోడ్షోలో పాల్గొని ప్రసంగించారు.
అనంతరం చంద్రబాబు మార్కాపురం, కందుకూరు సభల్లో పాల్గొనాల్సి ఉంది. అయితే హెలికాప్టర్లో సాంకేతిక లోపం ఏర్పడటంతో ఆ రెండు సభలు రద్దు చేసుకున్నారు. రోడ్డు మార్గం గుండా నెల్లూరు జిల్లాలోని రావూరుకు బయల్దేరారు.
రేపు మూడు జిల్లాల్లో చంద్రబాబు పర్యటన
చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాల్లో పర్యటించనున్నారు. బుధవారం మధ్యాహ్నం ఒకటిన్నరకు అనంతపురంలో చంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారని టిడిపి శ్రేణులు తెలిపాయి.
ఆ తర్వాత మధ్యాహ్నం 3.45గంటలకు కడప జిల్లా జమ్మలమడుగులో, రాత్రి 8 గంటలకు చిత్తూరు జిల్లా తిరుపతిలో చంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారని తెలుగుదేశం పార్టీ శ్రేణులు పేర్కొన్నాయి. ఏప్రిల్ 28 తెలంగాణలో ప్రచారం ముగియడంతో సీమాంధ్ర ప్రాంతంలో చంద్రబాబు నాయుడు విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.