ముగ్గుల పోటీ మన వారసత్వం, సాంకేతికతతో అవినీతి లేని పాలన: చంద్రబాబు
నారావారిపల్లె: ముగ్గుల పోటీలు మన వారసత్వమని, వాటిని కాపాడుకోవాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. శనివారం నారావారిపల్లెలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా విదేశీ సంస్కృతికి, మన సంప్రదాయాలకు చాలా తేడా ఉంటుందని చెప్పారు.
సంస్కృతి, సంప్రదాయాలను కాపాడు కోవాలని ఆయన పిలుపునిచ్చారు. విలువలతో కూడిన జీవన విధానం ఒక్క భారతదేశంలోనే ఉందన్నారు. చైనా, జపాన్ లాంటి దేశాల్లో యువత తగ్గుతోందన్నారు. సాంకేతికతతో అవినీతి లేని పాలనను అందిస్తున్నామని అన్నారు.
ఏపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్మార్ట్ విలేజ్కు మంచి స్పందన లబభిస్తోందని చెప్పుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్లో 10 లక్షల పంట కుంటలను తవ్విస్తున్నామని ఆయన అన్నారు. ఏపీలోని ప్రతి ఇంటికి 10 ఎంబీపీఎస్ స్పీడ్తో సింగిల్ లైన్ కేబుల్స్ను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు.
ఉపాధి కోసం పల్లెల నుంచి పట్టణాలకు వలసపోతున్నారని చెప్పిన ఆయన ఈ ఏడాది పట్టణాల నుంచి పల్లెలకు భారీగా తరలివచ్చారని ఆయన తెలిపారు. ఈ ఏడాది వలసలు భారీగా పెరిగాయని అన్నారు. సమాజం ఆనందంగా ఉండాలంటే సంక్షేమ కార్యక్రమాలు మరిన్ని చేపట్టాలని అన్నారు.
నైపుణ్యం, సమర్ధతతో ఏదైనా సాధించవచ్చని ఆయన పేర్కొన్నారు. రోజు రోజుకు అక్షరాస్యత పెరుగుతూనే ఉంది తప్ప, తగ్గే పరిస్థితి లేదని ఆయన అన్నారు. రాష్ట్రంలో సాంస్కృతిక కార్యక్రమాలను బాగా ప్రోత్సహిస్తున్నామని చెప్పారు.
జన్మభూమి ద్వారా వినూత్న కార్యక్రమాలను చేపడుతున్నామని అన్నారు. ప్రజలు ఆహారపు అలవాట్లు మార్చుకోవాలని, వ్యాయామం మానసిక ఆనందాన్ని కలిగిస్తుందన్నారు. ఎల్ఈడీ బల్బులతో 40 శాతం విద్యుత్ ఆదా అవుతుందని ఆయన తెలిపారు.