దాడి చేసి రివర్స్ కేసులా ? టీడీపీతో పెట్టుకుంటే కాలగర్భంలోనే ; దేవినేని కుటుంబానికి చంద్రబాబు పరామర్శ
దేవినేని ఉమాపై దాడి, ఆపై అరెస్ట్ ఘటనల నేపథ్యంలో మాజీ మంత్రి దేవినేని ఉమ నివాసానికి చేరుకుని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు దేవినేని ఉమా కుటుంబాన్ని పరామర్శించారు. టిడిపి అధినేత చంద్రబాబు పర్యటన నేపథ్యంలో గొల్లపూడిలో కూడా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. వైసిపి దళిత సంఘాల నాయకులు చంద్రబాబుని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించి పరిస్థితిని పర్యవేక్షించారు.
వైసీపీ మైనింగ్ మాఫియా.. ఎన్జీటీ విచారణతో జగన్ రెడ్డి అండ్ కో, ఆ అధికారులకు చిప్పకూడే : నారా లోకేష్
దేవినేని కుటుంబాన్ని పరామర్శించిన చంద్రబాబు
దేవినేని ఉమ నివాసానికి చేరుకున్న చంద్రబాబు వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. తెలుగుదేశం పార్టీ దేవినేని ఉమకి, ఆయన కుటుంబానికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. దేవినేని ఉమతో పాటుగా, కేసులు నమోదైన టిడిపి కార్యకర్తలను సైతం చంద్రబాబు పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు వైసీపీ నేతలే దాడులు చేసి దేవినేని ఉమా పై రివర్స్ కేసులు పెట్టారని దుయ్యబట్టారు. కొండపల్లి బొమ్మలు తయారు చేసే చోట చెట్లను నరికేస్తున్నారని, పర్యావరణం దెబ్బతింటుందని ఉమాతో పాటు టిడిపి నేతలు అక్కడికి వెళ్లారని చెప్పారు.
దేవినేని ఉమాపై దాడి చేసి రివర్స్ కేసులు పెట్టటం దుర్మార్గం
దేవినేని ఉమా పై కేసులు పెట్టడం చాలా దుర్మార్గమైన చర్య అని చంద్రబాబు మండిపడ్డారు. జరిగిన ఘటన మొత్తాన్ని ప్రజలంతా గమనించారని పేర్కొన్న చంద్రబాబు ఎస్సీల పై దాడి జరిగినట్లుగా దేవినేని ఉమా పై తప్పుడు కేసులు పెట్టారని మండిపడ్డారు. అక్రమ మైనింగ్ జరుగుతుంది అని చెప్పినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అసహనం వ్యక్తం చేశారు. దాడి చేసి రివర్స్ కేసు పెట్టడం నీచమైన చర్య అని చంద్రబాబు మండిపడ్డారు. పోలీసులు గతంలో నీచంగా ఎప్పుడూ పని చేయలేదని, పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు.
అక్రమ మైనింగ్ జరగకపోతే నిజ నిర్ధారణ కమిటీని ఎందుకు అడ్డుకున్నారు ?
అక్రమ మైనింగ్ జరగకపోతే నిజ నిర్ధారణ కమిటీని ఎందుకు అడ్డుకున్నారో చెప్పాలని చంద్రబాబు ప్రశ్నించారు. పోలీసులు కావాలని దాడి జరిగే ప్రాంతం వైపు దేవినేని ఉమా వెళ్లేలా చేశారని, దారి మళ్లించారని చంద్రబాబు ఆరోపించారు. దాడులకు టీడీపీ భయపడేది లేదని తేల్చి చెప్పారు. టిడిపితో పెట్టుకున్న వాళ్ళంతా కాలగర్భంలో కలిసిపోయారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. దేవినేని ఉమా పైన దాడి చేసి ఆయనపైనే హత్యాయత్నం కేసు పెట్టడానికి ప్రభుత్వానికి సిగ్గు ఉందా అని చంద్రబాబు నిలదీశారు.
Recommended Video
అక్రమ మైనింగ్ పై గవర్నర్ జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి
డీజీపీ గౌతమ్ సవాంగ్ ఇలా చేయటం అన్యాయమని పేర్కొన్న చంద్రబాబు దేవినేని ఉమ చేసిన తప్పేంటో చెప్పాలన్నారు. ఆయన కారులోనే ఎనిమిది గంటలపాటు ఉన్నారని, ప్రస్తుత ప్రభుత్వ హయాంలో ఆయన ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. దేవినేని ఉమ ప్రాణాలు కాపాడాలని డీజీపీకి తాను లేఖ రాశానని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రభుత్వ తీరును తప్పుబట్టారు .అక్రమ మైనింగ్ పై గవర్నర్ జోక్యం చేసుకోవాలని చంద్రబాబు కోరారు. సీనియర్ అధికారులతో విచారణ కమిటీని వేసి నిజానిజాలు తేల్చాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.