బాధపడ్డారట.. నొప్పెందుకో, మీ వాళ్లేనా: బాబుపై హరీష్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్ రావు గురువారం నిప్పులు చెరిగారు. తెలంగాణ ప్రభుత్వం అక్రమ భవనాలను కూల్చితే చంద్రబాబుకు నొప్పి ఎందుకు అని ఘాటుగా ప్రశ్నించారు. కబ్జాదారులకు, భూఆక్రమణదారులకు చంద్రబాబు వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు.
భూఅక్రమార్కుల్లో చంద్రబాబు బంధువులు, తెలుగుదేశం పార్టీ లీడర్లు ఉన్నారా అని ప్రశ్నించారు. సచివాలయంలో కంచె వేయాలన్నది గవర్నర్ నిర్ణయమని చెప్పారు. విభజన బిల్లుకు తూట్లు పొడుస్తోంది చంద్రబాబే అన్నారు. రెండు ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా చంద్రబాబు ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు.
తమ వైపు నుండి ఒక్క కవ్వింపు చర్య కూడా లేదన్నారు. పక్క రాష్ట్రాలతో సత్సంబంధాలనే కేసీఆర్ కోరుకుంటున్నారని తెలిపారు. సీమాంధ్ర పాలకులు తెలంగాణపై కుట్ర చేస్తున్నారని ధ్వజమెత్తారు. చర్యలకు తాము ఎప్పుడు సిద్ధమేనని అన్నారు. ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు తాము కృషి చేస్తున్నామని చెప్పారు. అక్రమ నిర్మాణాల కూల్చివేత చూసి చంద్రబాబు ఎందుకు బాధ కలిగించిందట అన్నారు.
తాము నీతివంతమైన పాలన అందిస్తుంటే చంద్రబాబుకు తప్పుగా కనిపించిందా అన్నారు. బాధ్యత కలిగిన నాయకుడు తప్పులను సమర్థించడన్నారు. ఆంధ్రా నాయకులు అబద్దాలు చెబుతున్నారన్నారు. తెలంగాణ ప్రభుత్వాన్ని దెబ్బతీసేందుకు ఏపీ ప్రభుత్వం కుట్రలు చేస్తోందన్నారు. లోయర్ సీలేరు విద్యుత్ ప్రాజెక్టు తెలంగాణకు దక్కకుండా చంద్రబాబు కుట్ర చేశారన్నారు.
తెలంగాణలో పరిశ్రమలు స్థాపించడానికి వస్తున్న పారిశ్రామికవేత్తలను తప్పుదోవ పట్టించేందుకు ఏపీ సర్కార్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఆంధ్ర సర్కారు ఎన్ని కుట్రలకు పాల్పడినా ప్రయోజనం ఉండదన్నారు. అసత్య ప్రచారాలతో పారిశ్రామికవేత్తలను మభ్యపెడుతోందని విమర్శించారు.