3కిలోలు తగ్గిన చంద్రబాబు: భారీ వర్షం, తడిచిన టెంట్లు
న్యూఢిల్లీ: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తన దీక్షను కొనసాగిస్తున్నారు. తెలుగు ప్రజలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని ఎపి భవన్లో చేస్తున్న బాబు దీక్ష శుక్రవారం ఐదో రోజుకు చేరుకుంది. శుక్రవారం ఉదయం న్యూఢిల్లీలో భారీ వర్షం కురిసింది. ఈ వర్షం కారణంగా టిడిపి దీక్షా శిబిరంలోను టెంట్లు పూర్తిగా తడిసిపోయాయి. ప్రాంగణం అంతా నీటితో తడిచింది.
మరోవైపు దీక్ష చేస్తున్న బాబుకు వైద్యులు పరీక్షలు నిర్వహించారు. దీక్షను విరమించాలని వైద్యులు సూచించినప్పటికీ చంద్రబాబు ససేమీరా అంటున్నారు. తెలుగు ప్రజలకు సమన్యాయం పైన కేంద్రం నుండి స్పష్టమైన హామీ వచ్చే వరకు తాను దీక్షను విరమించేది లేదని స్పష్టం చేశారు. ఐదు రోజులుగా దీక్ష చేస్తున్న బాబు మూడు కిలోల బరువు తగ్గారు.
మరోవైపు చంద్రబాబు దీక్షను భగ్నం చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ రోజు రాత్రి వరకు బాబు దీక్షను భగ్నం చేసే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. గురువారం బాబుకు రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రి వైద్యులు రెండుసార్లు పరీక్షలు నిర్వహించారు.
ఆనంతరం వారు కేంద్ర ప్రభుత్వ సంయుక్త కార్యదర్శి (ఆసుపత్రులు), న్యూఢిల్లీ డిసిపి, ఎపి భవన్ రెసిడెంట్ కమిషనర్, ఆరోగ్య విభాగం డైరెక్టర్ జనరల్కు ఒక నివేదికను సమర్పించారు. చంద్రబాబు నీరసించారని అందులో పేర్కొన్నారు.