చెప్తే చంద్రబాబు విన్లేదు, వైసిపికి విజయసాయికేం సంబంధం: భూమా
కర్నూలు: ఏపీ నుంచి రాజ్యసభకు నాలుగో అభ్యర్థిని బరిలోకి దింపుతామని తాము ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు చెబితే అంగీకరించలేదని నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి అన్నారు. ఆయన ఇటీవల వైసిపి నుంచి టిడిపిలో చేరిన విషయం తెలిసిందే.
ఏపీ నుంచి నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీ ఉన్నాయి. సభలో బలాన్ని బట్టి టిడిపి - బీజేపీలకు మూడు, వైసిపికి ఒక సీటు దక్కనుంది. ఈ నేపథ్యంలో నాలుగో స్థానం పైన పోటీ విషయమై తెలుగుదేశం పార్టీ తర్జన భర్జన పడింది. కానీ చివరి నిమిషంలో వెనక్కి తగ్గింది.
దీనిపై భూమా మాట్లాడారు. నాలుగో అభ్యర్థిని నిలబెట్టాలని చంద్రబాబుకు చెప్పామని, కానీ అంగీకరించలేదన్నారు. రాజ్యసభ ఎన్నికల్లో నాలుగో అభ్యర్థిని పెట్టాలని కోరడానికి తామంతా ఆయన వద్దకు వెళ్లామని, గెలిపించి తీరుతామని చెప్పినా వినలేదన్నారు.
అటువంటి గెలుపు అవసరం లేదని, పోటీ అక్కర్లేదని చెప్పారన్నారు. నిర్ణయం తమకు వదిలిపెడుతూనే తనకు మాత్రం పోటీ పెట్టడం ఇష్టం లేదని స్పష్టంగా చెప్పారన్నారు. గెలిచే అవకాశం ఉన్నప్పుడు ఆయన ఇటువంటి వైఖరి తీసుకోవడం తమకు ఆశ్చర్యం కలిగించిందన్నారు.
జగన్ తన ఇంటి వ్యవహారాలు చక్కదిద్దుకోవడానికి తన ఆడిటర్ను ఎంపీగా పెట్టడం ఏమిటి? పార్టీకి, ఆయనకు ఏం సంబంధం? ఇక పార్టీలో పనిచేసే నాయకులు ఏం కావాలని భూమా ప్రశ్నించారు. విజయ సాయి రెడ్డికి రాజ్యసభ ఇవ్వడాన్ని ఆయన తప్పుబట్టారు.