వార్ మొదలైనట్లే?: దూకుడు పెంచాలన్న బాబు, 'జగన్'ను ఎదుర్కొనేందుకు వ్యూహం!
వైసీపీ ఇచ్చిన హామిలు, టీడీపీ సభ్యులు వాటిని ఎలా తిప్పికొట్టాలి? అన్న అంశాలపై పార్టీ నేతలకు చంద్రబాబు దిశా నిర్దేశం చేసినట్లు తెలుస్తోంది.
అమరావతి: ఏపీ రాజకీయాల్లో ఎన్నికల వార్ అప్పుడే మొదలైపోయినట్లు కనిపిస్తోంది. అధికార-ప్రతిపక్ష పార్టీలు ఎత్తులకు పై ఎత్తులతో రెండేళ్లు ముందుగానే ఎన్నికల హీట్ పుట్టించేస్తున్నాయి. వైసీపీ సమర శంఖం పూరించడంతో.. అందుకు ధీటుగా బదులిచ్చేందుకు ఇప్పుడు టీడీపీ కూడా కసరత్తులు మొదలుపెట్టేసింది.
ప్రశాంత్ కిషోర్ గెలిపిస్తాడట: జగన్పై బాబు, రాజధాని తరలింపుపై అనుమానాలు?
సోమవారం నాడు సచివాలయంలో నిర్వహించిన పార్టీ పార్లమెంటరీ సమావేశంలో చంద్రబాబు ప్రధానంగా దీని పైనే ఫోకస్ చేసినట్లు చెబుతున్నారు. వైసీపీ ఇచ్చిన హామిలు, టీడీపీ సభ్యులు వాటిని ఎలా తిప్పికొట్టాలి? అన్న అంశాలపై పార్టీ నేతలకు చంద్రబాబు దిశా నిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. రెండేళ్లు ముందుగానే జనంలోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నందునా.. వైసీపీకి పథకాలకు విస్తృత ప్రచారం లభించే అవకాశం ఉందని టీడీపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి నేతలంతా సిద్దంగా ఉండాలని, మూకుమ్మడిగా ఎదురుదాడికి దిగాలని చంద్రబాబు నేతలతో చెప్పినట్లు సమాచారం. పార్టీ నేతలంతా స్పీడు పెంచి పనిచేయాల్సి ఉంటుందని, అదే సమయంలో ప్రభుత్వ పనితీరును ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించినట్లు తెలుస్తోంది. టీడీపీ పథకాల పట్ల లబ్దిదారులు సంతోషం వ్యక్తం చేస్తుండటం పార్టీకి కలిసొచ్చే అంశమని కూడా ఆయన వివరించినట్లు చెబుతున్నారు.
నిజానికి వచ్చే పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ సమావేశం ఏర్పాటు చేసినా.. చర్చ మాత్రం వైసీపీ చుట్టే తిరిగిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తంగా వైసీపీ పుట్టించిన ఎన్నికల సెగకు టీడీపీ కూడా ధీటుగా ప్రతిస్పందించడానికి సిద్దమవుతుండటంతో.. భవిష్యత్తు రాజకీయాలు మరింత వేడెక్కే సూచనలు కనిపిస్తున్నాయి.