హోదాకు చెల్లుచీటీ, చంద్రబాబు ఓకే: పవన్, జగన్లకు చాన్స్
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాదనే విషయం మరోసారి తేటతెల్లమైంది. ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తున్నామని చెబుతున్న తెలుగుదేశం పార్టీ నాయకులకు, హోదా వస్తే మంచిదే కదా అనే చంద్రబాబు నాయుడు ఇక ఆ డిమాండ్ను వదిలేసినట్లే. ప్రత్యేక హోదా డిమాండ్ను వదులుకున్న విషయాన్ని చంద్రబాబు స్పష్టంగానే చెప్పారు.
ప్రత్యేక హోదా వల్ల వచ్చే గ్యాప్ను విదేశీ నిధుల ద్వారా భర్తీ చేస్తామని చెప్పారని చంద్రబాబు అంటూ ప్యాకేజీకీ ప్రత్యేక హోదాకు తేడా లేనప్పుడు ఏదైతే ఏమిటని ఆయన అన్నారు. ప్రభుత్వ భవన నిర్మాణాలకు గుంటూరులో శుక్రవారం జరిగిన సభలో కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ సమక్షంలో చంద్రబాబు ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరిస్తూ ప్రత్యేక హోదా డిమాండ్ను వదులుకున్నారు.
కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తాము చేస్తున్న సాయాన్ని, చేయబోతున్న సాయాన్ని వివరించారు. ఈ కార్యక్రమలో పాల్గొన్న కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ప్రత్యేక హోదా కోసం ఆందోళనకు దిగుతున్న జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ను, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ను తప్పుపట్టారు.
పవన్ కల్యాణ్ అలా మాట్లాడారు...
ప్రత్యేక హోదాపై బిజెపి మిత్రుడు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ గట్టిగానే ఉన్నట్లు కనిపించారు. తిరుపతి, కాకినాడ సభల్లో ఆయన ప్రత్యేక హోదాపై గళమెత్తారు. కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు కూడా చేశారు. ప్రత్యేక హోదా కోసం పోరాటం చేయని రాష్ట్ర ఎంపిలను తప్పు పట్టారు. ప్రతిపక్షాలు ప్రత్యేక హోదా కోసం పోరాటం చేయాలని, వారు విఫలమైతే తాను ముందుకు వస్తానని ఆయన చెప్పారు.
అనంతపురం సభలో ఏం చేస్తారు..
పవన్ కల్యాణ్ నవంబర్ 10వ తేదీన అనంతపురంలో బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ఈ బహిరంగ సభలో పవన్ కల్యాణ్ ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతారా, లేదా అనేది తేలాల్సి ఉంది. ప్రస్తుతం ప్రతిపక్షాలకు ప్రధానమైన ఎజెండా ప్రత్యేక హోదానే. ఆయన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా మరింత గట్టిగా గళమెత్తుతారా లేదా అనేది ఆసక్తికరమైన విషయం.
జగన్ ఇదే చాన్స్...
ప్రత్యేక హోదాను వదులుకున్నట్లు చంద్రబాబు చాలా స్పష్టంగా చెప్పిన నేపథ్యంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్కు మంచి అవకాశం లభించినట్లే. ప్రత్యేక హోదాపై చంద్రబాబు నాయుడిని మరింతగా చిక్కుల్లో పడేసే ప్రయత్నం చేయవచ్చు. పార్లమెంటు సభ్యులతో రాజీనామా చేయిస్తానంటున్న జగన్ వ్యూహం ఫలిస్తుందా, రాజకీయంగా ఆయనకు ఉపయోగపడుతుందా అనేది చర్చనీయాంశంగా మారింది.
నీకు నేను... నాకు నువ్వు...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బిజెపి, తెలుగుదేశం పార్టీ కలిసి పయనించాలనే అనుకుంటున్నట్లు అర్థమవుతోంది. అరుణ్ జైట్లీ, వెంకయ్య నాయుడు, చంద్రబాబు నాయుడు మాట్లాడిన తీరు ఆ విషయాన్ని తెలియజేస్తోంది. చంద్రబాబును దూరం చేసుకోవడానికి ఇష్టంగా లేమనే సంకేతాలను అరుణ్ జైట్లీ స్పష్టంగానే ఇచ్చారు. నీకు నేను.. నాకు నువ్వు... అనే పద్దతిలోనే ఆ రెండు పార్టీలు పయనించదలుచుకున్నట్లు చెప్పవచ్చు.