అనంతలో బాబుకు చేదు, ప్లీజ్! హైదరాబాద్ వద్దు.. ఏపీ సీఎంకు రీట్వీట్
అనంతపురం/అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు అనంతపురం జిల్లాలో చేదు అనుభవం ఎదురైంది. మా ఊరు - జన్మభూమి కార్యక్రమంలో భాగంగా ఆయన జిల్లాలోని గొట్లూరులో బుధవారం నాడు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన స్థానికులకు వేరు శనగ పంపిణీ చేశారు. పంపిణీ కార్యక్రమానికి పెద్ద ఎత్తున జనాలు ఎగబడ్డారు. తోపులాట జరిగింది. పలువురు కిందపడ్డారు. దీంతో, చంద్రబాబు నాయుడు కార్యక్రమం మధ్యలోనే వెళ్లిపోయారు.
చిక్కులు తెచ్చిన చంద్రబాబు ట్విట్టర్ కామెంట్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు జూన్ 1వ తేదీన ట్వీట్ చేశారు. జూన్ 2న రాష్ట్ర విభజన, నవ నిర్మాణ దీక్ష నేపథ్యంలో ఆయన ట్వీట్ చేశారు. తెలుగులో, ఇంగ్లీష్లో ఆయన ట్వీట్ చేశారు.
దేశభక్తితో, సామాజిక బాధ్యతతో, క్రమశిక్షణతో మన రాష్ట్ర ప్రగతి కోసం, శ్రేయస్సుకోసం, మనమందరం భుజంభుజం కలిపి పని చేద్దామని ఓ ట్వీట్, 2029 వరకు దేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా, 2050 వరకు ప్రపంచంలో ఉత్తమ రాష్ట్రంగా ఏపీని చేయాలనేది తన సంకల్పం అని పేర్కొన్నారు.
ఈ ట్వీట్ పైన ఓ ప్రతిస్పందన వచ్చింది. ఒకరు రీట్వీట్ చేశారు. అందులో.. ఏపీ ప్రభుత్వాన్ని మన రాష్ట్రానికి తీసుకు రావాలని అందులో అభిప్రాయపడ్డారు. హైదరాబాదు నుండి పాలనతో ఏపీ ప్రజలు సంతోషంగా లేరని, ప్లీజ్ పాత చంద్రబాబులా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు.