బాబు వస్తే ధరలు ఇలా, అధికారంలోకి వస్తే బెంజి కారు, కిలో బంగారం: జగన్
చిత్తూరు: నారా చంద్రబాబు నాయుడు పాలనలో అంతా బాదుడేనని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఆయన సీఎం కాకముందు రేషన్ షాపులో బియ్యంతో పాటు చక్కెర, కందిపప్పు, పామాయిల్, గోధుమలు, కారం, చింతపండు ఇలా అన్నీ దొరికేవని, ఇప్పుడు దొరకడం లేదన్నారు.
Recommended Video

పైగా చంద్రన్న మాల్స్ అంటూ తీసుకు వచ్చాడని, ఈ మాల్స్లో అన్ని ధరలు కూడా ఎక్కువేనని, బయట మార్కెట్లో చక్కెర రూ.35 ఉంటే, చంద్రన్న మాల్స్లో మాత్రం రూ.48గా ఉందని, చింతపండు బయట రూ.145 ఉంటే, చంద్రన్న మాల్స్లో రూ.290గా ఉందని విమర్శించారు.

హెరిటేజ్ అభివృద్ధి కోసమే
చంద్రబాబు పాలన అవినీతిమయమైందని జగన్ విమర్శించారు. చంద్రబాబు సీఎంగా బాధ్యతలు స్వీకరించిన ప్రతిసారీ జిల్లాలోని సహకార చక్కెర, సహకార పాల డెయిరీలు మూతపడుతున్నాయని ఆరోపించారు. తన హెరిటేజ్ డెయిరీ అభివృద్ధి కోసమే గతంలో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో తన అనుయాయుల చేత పథకం ప్రకారం డెయిరీని, అదేవిధంగా జిల్లాలోని నాలుగు ప్రయివేటు చక్కెర కర్మాగారాల యాజమాన్యాలతో లాలూచీపడి చిత్తూరు, రేణిగుంట సహకార చక్కెర కర్మాగారాలను మూయించి నిర్వీర్యం చేసే పనిలో ఉన్నారని మండిపడ్డారు.

జిల్లాలో దయనీయం
చిత్తూరు జిల్లాలో పాడి రైతుల పరిస్థితి మరింత దయనీయంగా ఉందని, వారిని ఆదుకునేందుకు బాబు ఎటువంటి చర్యలు తీసుకోలేదని జగన్ అన్నారు. తమ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డాక పాడి రైతులకు తప్పకుండా న్యాయం జరగుతుందన్నారు. రైతు, డ్వాక్రా రుణాల మాఫీ పేరుతో గద్దెనెక్కిన బాబు సంబంధిత వర్గాల వారికి పైసా కూడా మాఫీ చేయకుండా కాలయాపన చేస్తున్నారన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి పాలనలో హంద్రీ- నీవా ప్రాజెక్టు పనులు 80 శాతం పూర్యయ్యాయని, అయితే మిగిలిన 20 శాతాన్ని పూర్తి చేయలేని స్థితిలో నేడు రాష్ట్ర ప్రభుత్వం ఉందన్నారు.

మనకు శాపంగా మారింది
తన నాలుగేళ్ల పాలనలో ఓ కాలువను తీసుకువచ్చి హంద్రీ నీవా ప్రాజెక్టుకు అనుసంధానం చేసేందుకు కూడా చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నించకపోవడం జిల్లా రైతులకు
శాపంలా మారిందని జగన్ అన్నారు. వ్యవసాయం దండగ అన్న వ్యక్తి రాష్ట్రాన్ని పాలిస్తుండటం వల్లే రైతులకు ఇలాంటి దుస్థితి ఏర్పడిందన్నారు.

వచ్చే ఎన్నికల్లో గెలిస్తే బెంజి కారు, కిలో బంగారం
ప్రముఖ పుణ్యక్షేత్రాలైన తిరుమల, కాణిపాకం ఆలయాల పాలకమండళ్ల పదవీకాలం పూర్తయి నెలలు కావస్తున్నా కొత్త పాలకమండళ్లను ఏర్పాటు చేయలేని దుస్థితిలో ప్రస్తుత ప్రభుత్వం ఉందని జగన్ మండిపడ్డారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టామని చెబుతున్న జన్మభూమి కమిటీలు మాఫీయా ముఠాలుగా మారాయన్నారు. ప్రజలను మోసం చేయడంలో బాబు పిహెచ్డి చేశారని, వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధించి అధికారంలోకి వస్తే ఇంటింటికి ఒక కేజీ బంగారంతో పాటు, ఒక బెంజి కారును ఉచితంగా ఇస్తానని కూడా హామీ ఇచ్చే రకమన్నారు.












Click it and Unblock the Notifications