చంద్రబాబు కుప్పం టూర్ -గతానికీ ఇప్పటికీ ఎంత తేడా ! వైసీపీ కౌంటర్ వ్యూహం సిద్ధమేనా?
ఏపీలో వైసీపీ వర్సెస్ టీడీపీగా సాగుతున్న రాజకీయాల్లో ఈ మధ్య తరచుగా వినిపిస్తున్న పేరు కుప్పం. విపక్ష నేత చంద్రబాబు నాలుగు దశాబ్దాలుగా వరుసగా గెలుస్తున్న ఈ నియోజకవర్గంలో ఈసారి ఎలాగైనా ఓడించాలని వైసీపీ పట్టుదల ప్రదర్శిస్తోంది. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన చంద్రబాబు సొంత నియోజకవర్గాన్ని మూడు రోజుల్లో చుట్టేశారు. అయితే వైసీపీ నేతలు ఆయన టూర్ ను టార్గెట్ చేస్తూ దాడులకు దిగడంతో రాజకీయం మొత్తం మారిపోయింది. దీంతో అది చంద్రబాబుకే సానుభూతి తెచ్చింది. ఈ నేపథ్యంలో వైసీపీ కౌంటర్ వ్యూహాన్ని సిద్దం చేస్తోంది.
చంద్రబాబు టూర్ సక్సెస్
నాలుగు దశాబ్దాలుగా కుప్పంలో అపజయం లేకుండా సాగుతున్న చంద్రబాబు జైత్రయాత్రకు ఎలాగైనా బ్రేక్ వేయాలని వైసీపీ ప్రయత్నిస్తున్న తరుణంలో ఆయన వ్యూహం మార్చారు. కుప్పంలో వరుస పర్యటనలతో ముందుగా అక్కడ క్యాడర్ లో స్ధైర్యం నింపేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో మూడు రోజుల పాటు కుప్పంలో చంద్రబాబు పర్యటించారు. ఈ టూర్ తో కుప్పంలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. అంతే కాదు రాష్ట్రంలోనూ ఈ టూర్ చర్చనీయాంశమైంది. అంతకు మించి రాజకీయంగా దీన్ని వాడుకునేందుకు చంద్రబాబు వేసిన ప్లాన్ సక్సెస్ అయింది.
గతానికీ ఇప్పటికీ ఎంతో తేడా?
గతంలో చంద్రబాబు కుప్పం పర్యటన అంటే పెద్దగా ఎవరికీ తెలిసేది కాదు. సంక్రాంతికో, దసరాకో వచ్చి స్ధానికులతో కలిసి సంబరాలు చేసుకోవడం, వీలైతే కుటుంబ సభ్యుల్ని కూడా తీసుకురావడం, కాసేపు సేదతీరడం, స్ధానిక టీడీపీ నేతలతో భేటీలు మాత్రమే కనిపించేవి. రాజకీయాల ప్రస్తావన ఎక్కువగా ఉండేది కాదు. దీనంతటికీ ప్రధాన కారణం కుప్పంలో చంద్రబాబు మినహా మరొకరు గెలవరన్న ధీమా.
కానీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్ధానిక సంస్ధల ఎన్నికల్లో టీడీపీకి ఎదురైన ఓటములు ఈ ధీమాను సడలేలా చేశాయి. దీంతో చంద్రబాబు కూడా డిఫెన్స్ లో పడ్డారు. చివరికి ఎక్కడ పోగొట్టుకున్నారో అక్కడే వెతుక్కునేందుకు ప్రయత్నించారు. అంతే కాదు కుప్పంలో తనను టార్గెట్ చేసేందుకు వైసీపీ చేసిన ప్రయత్నాన్ని తిప్పికొట్టడంతో పాటు తనకు దశాబ్దాలుగా అండగా నిలుస్తున్న స్ధానికుల్లోనూ ధీమా నింపారు. తద్వారా ఈసారి కుప్పంలో చంద్రబాబు టూర్ సక్సెస్ అయిందన్న భావన కల్పించారు.
ఫలించిన ఎదురుదాడి వ్యూహం
రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చాక టీడీపీ క్యాడర్ పై పెట్టిన కేసులతో వారంతా చెల్లాచెదురయ్యారు. అదే సమయంలో చంద్రబాబు కేవలం విమర్శలకు మాత్రమే పరిమితమయ్యారు. రోడ్డుపైకి వచ్చి ఎదురుదాడి చేసేందుకు గట్టిగా ప్రయత్నించలేదు. దీంతో వైసీపీది పైచేయి అవుతోంది. అదే వ్యూహంతో చంద్రబాబును ఢీకొట్టేందుకు కుప్పంలోనూ వైసీపీ ప్రయత్నింస్తోది. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఈసారి కుప్పంలో వ్యూహం మార్చారు. తన సహజశైలికి భిన్నంగా రెచ్చిపోయారు. వైసీపీ క్యాడర్ దాడులు చేస్తుంటే తాను కూడా ఎదురుదాడికి దిగడంతో పాటు జగన్, పెద్దిరెడ్డి ఎవరొస్తారో రండంటూ సవాళ్లు కూడా విసిరారు. దీనికి వైసీపీ నుంచి సమాధానం రాలేదు.
వైసీపీ కౌంటర్ వ్యూహం సిద్ధమేనా?
కుప్పంలో ఎలాగైనా చంద్రబాబును ఓడించాలన్న లక్ష్యంతో దూకుడుగా ముందుకెళ్తున్న వైసీపీకి ఈసారి మాత్రం గట్టి ఎదురుదెబ్బలు తగిలాయి. ముఖ్యంగా చంద్రబాబుపై కోపంతో అన్న క్యాంటీన్ ను వైసీపీ కార్యకర్తలు ధ్వంసం చేయడం స్ధానికంగా విమర్శలకు తావిచ్చింది. అలాగే ప్రత్యర్ధి పార్టీ నేత పర్యటనకు ఆటంకాలు కల్పించడం ద్వారా స్ధానికుల్లోనూ వ్యతిరేకత వచ్చింది.
దీంతో చంద్రబాబు టూర్ లో వైసీపీ నేతలపై దాడులు చేశారంటూ టీడీపీ నేతలపై హత్యాయత్నం కేసులు, అట్రాసిటీ కేసులు నమోదు చేయించారు. అంతవరకూ బాగానే ఉన్నా చంద్రబాబును ఓడించే విషయంలో వైసీపీ ఇప్పుడు ఎలాంటి స్ట్రాటజీ అనుసరించబోతోందన్నది ప్రశ్నార్ధకమైంది.
చంద్రబాబు కుప్పం టూర్ లో ఉద్రిక్తతలు తలెత్తిన వేళ.. వైసీపీ ఎమ్మెల్సీ, స్ధానిక ఇన్ ఛార్జ్ అయిన భరత్ ఎక్కడా కనిపించలేదు, మాట్లాడలేదు. అలాంటి అభ్యర్దితో చంద్రబాబును ఓడించేందుకు వైసీపీ సిద్ధమైందా అన్న ప్రశ్నకు ఇప్పుడు సమాధానం వెతుక్కోవాల్సిన పరిస్ధితి. దీంతో వైసీపీ ఇప్పుడు ఏం చేయబోతోందన్న ప్రశ్న సర్వత్రా వినిపిస్తోంది.