క్వారంటైన్లో ఉన్న రోగులకు రూ. 2 వేలు ఇవ్వలేదే?: ఏపీ సర్కారును చంద్రబాబు నిలదీత
అమరావతి: రాష్ట్రంలో కరోనా కట్టడి చేయడంలో ప్రభుత్వం అన్ని విధాలుగా విఫలమైందని టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు విమర్శించారు. కరోనా విషయంలోఏపీ సర్కారు చేతులెత్తేసిందని ధ్వజమెత్తారు. గురువారం వైద్య నిపుణులు, కరోనా విజేతలతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఫ్రంట్లైన్ వారియర్స్ ప్రాణాలకు పణంగా పెట్టి పోరాడుతున్నారని ఈ సందర్భంగా చంద్రబాబు ప్రశంసించారు. ఈ క్లిష్ట సమయంలో ప్రజలకు ధైర్యం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. కొత్త జీవితానికి అలవాటు పడాలన్నారు. వ్యాక్సిన్ వచ్చే వరకూ అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కరోనాతో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందని అన్నారు.

కరోనా ప్రభావం ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై పడిందన్న చంద్రబాబు.. అలాంటివారిని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. చేతివృత్తులు, కులవృత్తులు, భవన నిర్మాణ కార్మికులు, వలస కూలీలకు చాలా ఇబ్బందులున్నాయని చెప్పారు. అలాంటి ప్రతి కుటుంబానికి రూ. 10వేల చొప్పున ఆర్థిక సాయం అందించాలని కోరారు.
ఇక కరోనా బాధితులు ఆస్పత్రుల్లో పడకలు దొరక్క తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చంద్రబాబు అన్నారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో రూ. 5 లక్షల నుంచి రూ. 20 లక్షల వరకు వసూలు చేస్తున్నారని చెప్పారు. క్వారంటైన్ లో ఉన్న రోగులకు రూ. 2వేలు ఇస్తామని గతంలో చెప్పిన ప్రభుత్వం.. ఆ నగదును ఇవ్వాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.
Recommended Video
మరోవైపు మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు కూడా ఏపీ సర్కారుపై విమర్శలు గుప్పించారు. రైతు ఆత్మహత్యల్లో ఏపీకి రెండో స్థానం సీఎం వైఎస్ జగన్ ఘనతేనని ఎద్దేవా చేశారు. రైతులకు రూ. 8వేల కోట్ల రుణమాఫీని వైసీపీ ఎగ్గొట్టిందని, రైతులకు ఇవ్వాల్సినవి ఇవ్వలేదన్నారు. రైతులను అప్పుల ఊబిలోకి నెట్టారన్నారు. రూ. 300 కోట్లు ఇవ్వకుండా రైతులను వేధిస్తున్నారని ఆరోపించారు. రైతుల భూములు లాక్కున్నారని, రైతు ద్రోహానికి వైసీపీ మూల్యం చెల్లించుకోక తప్పదని యనమల హెచ్చరించారు.












Click it and Unblock the Notifications