మా స్టాండ్ మారదు కానీ: కాంగ్పై దుమ్మెత్తిపోసిన బాబు
న్యూఢిల్లీ: విభజన విషయంలో తమ పార్టీ వైఖరిలో ఎలాంటి మార్పు లేదన్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కాంగ్రెసు పార్టీ పైన దుమ్మెత్తి పోశారు. సోమవారం ఆయన తన దీక్షకు ముందు న్యూఢిల్లీలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. విభజనపై తాము గతంలోనే లేఖ ఇచ్చామని, దానిపై మా స్టాండ్ మారలేదని, తాము విభజనకు వ్యతిరేకం కాదని విభజన తీరుకు మాత్రమే వ్యతిరేకమని చెప్పారు.
డెబ్బై రోజులుగా సీమాంధ్రలో ఉద్యమం జరుగుతున్నా కేంద్రం పట్టించుకోవడం లేదన్నారు. ఇరు ప్రాంతాలకు న్యాయం జరగాలని చెప్పారు. ఇరు ప్రాంత ఐకాసలతో మాట్లాడి సమస్య పరిష్కరించాలని తాము సూచించినా పట్టించుకోలేదన్నారు. చర్చల ద్వారా శాంతి నెలకొనాలని అభిప్రాయపడ్డారు. సీమాంధ్రలో పరిస్థితి రోజు రోజుకు దిగజారుతోందన్నారు. తాను ఉదయం నుంచే దీక్షలో ఉన్నానని, కాంగ్రెసు తీరుకు నిరసనగానే తాను దీక్ష చేస్తున్నట్లు చెప్పారు.
ఎన్నికల్లో గెలుపు కోసం కాంగ్రెసు ప్రయత్నాలు చేస్తోందని, అందులో భాగంగానే వైయస్సార్ కాంగ్రెసు అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి బెయిల్ వచ్చిందన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీతో పొత్తు, తెరాస విలీనం అనే మాటలు దేనికి సంకేతమన్నారు. ఇరు ప్రాంతాల్లో సొంత పార్టీ నేతలను బలిపెట్టి రెండు ప్రాంతాల్లో తెలంగాణలో తెరాస, సీమాంధ్రలో వైయస్ జగన్ పార్టీతో రాజకీయ లబ్ధి పొందేందుకు కాంగ్రెసు పార్టీ ప్రయత్నాలు చేస్తోందన్నారు.
కాంగ్రెసు పార్టీతో ఒప్పందం తర్వాతనే జగన్కు బెయిల్ వచ్చిందని చెప్పారు. కాంగ్రెసు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని, ఆ పార్టీకి దేశాన్ని పాలించే హక్కు లేదన్నారు. విభజన విషయంలో ఆ పార్టీది ఏకపక్షమని మండిపడ్డారు. ప్రజలను ఫణంగా పెట్టి కాంగ్రెసు పార్టీ కుళ్లు రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. తెరాస, వైయస్సార్ కాంగ్రెసు పార్టీతో కాంగ్రెసు కుమ్మక్కు రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. ప్రజలకు రాజకీయ వ్యవస్థపై నమ్మకం పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.