నీవు పార్టీకి ఉపయోగపడట్లేదు: మురళీమోహన్కు బాబు షాక్, ఇక చెప్పను.. చర్యలే! నేతల ర్యాంకులివి!
అమరావతి: తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ భేటీలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సుదీర్ఘంగా పార్టీ నేతలతో భేటీ అయ్యారు. రాష్ట్ర రాజకీయాలు, ఇటీవల జరిగిన పరిణామాలపై చర్చించారు. పలు అంశాలపై వారి మధ్య చర్చ జరిగింది.
చదవండి: ఆ తర్వాతే మారిన సీన్: నిజమేనా.. కర్నాటకపై లగడపాటి సర్వే, బీజేపీదే గెలుపు!
ప్రత్యక్షంగా, పరోక్షంగా పార్టీ నేతలకు క్లాస్ పీకారు అధినేత. రాజకీయాల నుంచి సినిమాల వరకు చర్చ సాగింది. వైసీపీ, బీజేపీలపై విరుచుకుపడ్డారు. మహానటి సినిమా బాగుందని తెలిసిందని బాబు వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో ఎన్టీఆర్ సినిమా గురించి కూడా చర్చకు వచ్చింది. ఓ సమయంలో నటుడు, ఎంపీ మురళీ మోహన్కు బాబు చురకలు అంటించారు.
చదవండి: ఓటుకు నోటు: చంద్రబాబుపై కేసు నిలబడేనా? అదే జరిగితే వైసీపీకి ఆయుధం
మురళీ మోహన్కు చంద్రబాబు చురక
నటుడు మురళీ మోహన్కు చంద్రబాబు చురకలు అంటించారు. మురళీ మోహన్ మంచి నిర్మాత, మంచి నటుడు అని, కానీ పార్టీకి ఉపయోగపడటం లేదని వ్యాఖ్యానించారు. దీంతో కంగుతిన్న మురళీ మోహన్.. తనకు ఎంపీగా సమయం సరిపోవడం లేదని అధినేతకు చెప్పారు. అందుకే పార్టీకి సమయం కేటాయించలేకపోతున్నట్లు చెప్పారు.
ఎన్టీఆర్ సినిమా కథ విన్నాను
టీడీపీ భేటీలో మహానటి సినిమా చర్చ కూడా వచ్చింది. ఈ సినిమా బాగా తీశారని అంటున్నారని, జీవిత చరిత్రలపై సినిమాలు తీస్తే బాగా ఆదరిస్తారన్నారు. ఈ సందర్భంగా మురళీ మోహన్ మాట్లాడుతూ.. ఎన్టీఆర్ సినిమా గురించి కథ విన్నానని, ఎన్టీఆర్ సీఎంగా ప్రమాణ స్వకారం చేసే వరకే మొదటి భాగం ఉందని, ఈ సినిమా కూడా బాగా వచ్చే అవకాశముందన్నారు ఎన్నికలను దృష్టిలో జనవరిలో విడుదల చేస్తే బాగుంటుందన్నారు.
వైసీపీ ఎంపీల రాజీనామాలు ఆమోదించే అవకాశం
ప్రత్యేక హోదా కోసం వైసీపీ ఎంపీలు రాజీనామా చేసిన అంశంపై చంద్రబాబు స్పందించారు. వారి రాజీనామాను జూన్ 2వ తేదీ తర్వాత ఆమోదించవచ్చునని వ్యాఖ్యానించారు. తెలంగాణలో ఓసారి 25 స్థానాలకు ఉప ఎన్నికలు వస్తే మనం ఏడు స్థానాల్లో గెలిచామన్నారు. వైసీపీ, బీజేపీ కుట్రలను ప్రజలు గమనిస్తున్నారని, కర్నాటకలో ఎన్జీవో నేత అశోక్ బాబుపై వైసీపీ వారు దాడి చేశారన్నారు. ప్రజలకు అన్ని విషయాలు చెప్పాలన్నారు. కర్నాటకలో బీజేపీకి అనుకూలంగా వైసీపీ నేతలు ప్రచారం చేశారన్నారు.
మంత్రులు, ఎమ్మెల్యేలకు ర్యాంకులు
టీడీపీ నేతల పనితీరుపై చంద్రబాబు ర్యాంకులు ఇచ్చారు. టీడీపీ ఎమ్మెల్యేల పనితీరుపై సర్వే చేయించారు. 70 శాతానికి పైగా ఎమ్మల్యేల పనితీరు బాగుందని, వారి పేర్లు చదివి వినిపించారు. పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాల అమలు ఆధారంగా ఈ ర్యాంకులను ప్రకటించారు.
జిల్లాల వారీగా ర్యాంకులు
అచ్చెన్నాయుడు (శ్రీకాకుళం), లలిత కుమారి (విజయనగరం), అయ్యన్నపాత్రుడు, వెలగపూడి రామకృష్ణ (విశాఖపట్నం), తోట త్రిమూర్తులు, జోగేశ్వర రావు (తూర్పు గోదావరి), చింతమనేని ప్రభాకర్, నిమ్మల రామానాయుడు, రాధాకృష్ణ (పశ్చిమ గోదావరి), వల్లభనేని వంశీ, శ్రీరాం తాతయ్య, బోడె ప్రసాద్, గద్దె రామ్మోహన్ రావు (కృష్ణా), దూళిపాళ్ల నరేంద్ర (గుంటూరు) పని తీరు బాగుందని బాబు కితాబిచ్చారు.
బెస్ట్ పొలిటికల్ పంచ్
ఇటీవల అసెంబ్లీలో ప్రజాప్రతినిధుల పనితీరుపై కూడా చంద్రబాబుు ర్యాంకులు ఇచ్చారు. అచ్చెన్నాయుడు బెస్ట్ పొలిటికల్ పంచ్, దేవినేని ఉమ బెస్ట్ ప్రజెంటేషన్, వాసుపల్లి గణేష్ బెస్ట్ మీడియా పాయింట్ ప్రజెంటేషన్లను ప్రకటించారు. కాగా, ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు ఎమ్మెల్యేలు, మంత్రులు వ్యక్తిగత బాధ్యత తీసుకోవాలని సూచించారు. బెల్ట్ షాపులను పూర్తిగా తొలగించామన్నారు. ఎక్కడ తిరిగి ప్రారంభించినా నేతలే తొలగించాలన్నారు.
ఇప్పటికే చాలాసార్లు చెప్పా.. ఇక చెప్పను చర్యలే
చంద్రబాబు పలువురు టీడీపీ నేతలకు క్లాస్ పీకారు. కొందరు పార్టీ కార్యక్రమాలను సీరియస్గా తీసుకోవడంలేదని, ఇప్పటికే చాలాసార్లు చెప్పానని, ఇక చెప్పనని, నేరుగా చర్యలే తీసుకుంటానని హెచ్చరించారు. సైకిల్ యాత్రను మరింత బాగా చేపట్టాలన్నారు. ఒక్కో ఎమ్మెల్యే సగటున ఏడు రోజులే యాత్ర నిర్వహించారని నివేదిక చూపించారు. ఎందుకు సీరియస్గా తీసుకోవడం లేదన్నారు. యూనివర్సిటీల్లో విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించాలని, హోదా కోసం ప్రజాప్రతినిధులు అందరూ ఢిల్లీకి వెళ్లాలని సూచించారు.