ఆ తర్వాతే మారిన సీన్: నిజమేనా.. కర్నాటకపై లగడపాటి సర్వే, బీజేపీదే గెలుపు!
విజయవాడ/అమరావతి: రాష్ట్ర విభజన జరిగితే రాజకీయాలకు గుడ్ బై చెబుతానని, అదే మాట మీద నిలబడిన విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఎప్పటికప్పుడు సర్వేలతో అందరి నోళ్లతో నానుతున్నారు. తనకు సర్వేలు చేయడం ఆసక్తి అని గతంలో ఆయన చెప్పారు. అయితే, దేశం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న కర్నాటక ఎన్నికలపై ఆయన మాట్లాడటం లేదు.
Recommended Video
చదవండి: ఇండియా టీవీ ఫైనల్ ఒపీనియన్ సర్వే: బీజేపీకి 85సీట్లు, ఏ సర్వే ఏం చెప్పిందంటే?
ఆయన పలుమార్లు సర్వేలు చేసి, వాటిని మీడియా ముందు పెట్టిన సందర్భాలు ఉన్నాయి. 2014లో ఢిల్లీ గద్దెను ఎక్కినప్పటి నుంచి బీజేపీ ఒకటి రెండు మినహా వరుసగా రాష్ట్రాలలో గెలుస్తోంది. ఇప్పుడు కర్నాటకలో గెలిచి పునర్వైభవం సాధించడంతో పాటు దక్షిణాదిన ఘనమైన ఖాతా తెరవాలని భావిస్తోంది. మరోవైపు కర్నాటక గెలుపుతో సార్వత్రిక ఎన్నికలకు ముందు బీజేపీని గట్టి దెబ్బ కొట్టాలని కాంగ్రెస్ చూస్తోంది.
చదవండి: కర్నాటక ప్రచారంలో టంగ్ స్లిప్: నరేంద్ర మోడీకి సిద్ధరామయ్య ప్రశంసలు
ఎక్కువ సర్వేలది హంగ్ మాట
ఈ నేపథ్యంలో కర్నాటక ఎన్నికలు అందరికీ ఆసక్తిని కలిగిస్తున్నాయి. గురువారం సాయంత్రం ఎన్నికల ప్రచారం ముగిసింది. శనివారం ఉదయం ఎన్నిక ప్రారంభం కానుంది. ఇప్పటికే ఎన్నో సంస్థలు కర్నాటక ఎన్నికల సర్వేలు విడుదల చేశాయి. హంగ్ వస్తాయని ఎక్కువ సర్వేలు చెప్పగా, కాంగ్రెస్ గెలుస్తుందని కొన్ని సర్వేలు, బీజేపీ గెలుస్తుందని మరికొన్ని సర్వేలు వెల్లడించాయి.
మోడీ వచ్చాక సీన్ రివర్స్
ప్రధాని నరేంద్ర మోడీ రాకతో బీజేపీ పేట్ మారిపోయిందని అంటున్నారు. మొదట్లో కాంగ్రెస్ పార్టీ తమ గెలుపు నల్లేరుపై నడకలా భావించింది. సర్వేలు కూడా ఆ పార్టీకి అనుకూలంగా వచ్చాయి. కానీ క్రమంగా పరిస్థితి మారిపోవడం ప్రారంభమైంది. ముఖ్యంగా ప్రధాని మోడీ రాక తర్వాత సీన్ మొత్తం మారిపోయిందని అంటున్నారు. కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరా హోరీ ఉంటుందని, హంగ్కు ఎక్కువ అవకాశాలు ఉన్నాయని, ఒకవేళ ఎవరు గెలిచినా రెండు మూడు సీట్లతో గెలుస్తారని అంటున్నారు. 'వన్ ఇండియా' ఫేస్బుక్ సర్వేలో బీజేపీ గెలుస్తుందని నెటిజన్లు అభిప్రాయపడ్డారు.
ధీటుగా ప్రచారం
లింగాయత్లకు ప్రత్యేక మతం, సిద్ధరామయ్య ప్రభుత్వంపై వ్యతిరేకత లేదనే అభిప్రాయం, మోడీ ప్రభుత్వంపై ప్రజల్లో ఆగ్రహం కారణంగా సులభంగా గెలుస్తామని కాంగ్రెస్ భావించింది. సిద్ధరామయ్య, రాహుల్ గాంధీ తదితరులు జోరుగా ప్రచారం చేశారు. కానీ మోడీ కఠిన నిర్ణయాలు దేశ భవిష్యత్తుకేనని ప్రజలు అర్థం చేసుకుంటున్నారని, అర్థమయ్యేలా బీజేపీ చెబుతోందని, అలాగే పార్టీ గెలుపు కోసం మోడీ, అమిత్ షా, ఇతర నేతలతో పాటు ఆరెస్సెస్ పని చేయడం కమల దళానికి ప్లస్ అంటున్నారు.
లగడపాటి సర్వే.. నిజమేనా?
కర్నాటకలో గెలుపుపై బీజేపీ, కాంగ్రెస్లతో పాటు జేడీఎస్ కూడా గట్టి విశ్వాసంతో ఉంది. సర్వే లెక్కలను ఎవరూ పట్టించుకోవడం లేదు. ఈ విషయం పక్కన పెడితే సర్వేలు అంటే తెలుగు రాష్ట్రాల్లో గుర్తుకు వచ్చే ఆంధ్రా ఆక్టోపస్ లగడపాటి కూడా కర్నాటక ఎన్నికలపై సర్వేలు నిర్వహించారట. ఇందులో నిజమెంతో కానీ సోషల్ మీడియాలో, వెబ్ సైట్లలో ఆయన సర్వేల ఫలితాలు అంటూ జోరుగా ప్రచారం సాగుతోంది.
లగడపాటి సర్వేలో బీజేపీ గెలుపు
కర్నాటక ఎన్నికల్లోను తమ రెగ్యులర్ సంస్థ ద్వారా సర్వేలు చేయించారట. ఈ సర్వే ప్రకారం ఈసారి కర్నాటక ఎన్నికల్లో గెలుపు బీజేపీదేనని తేలిందని అంటున్నారు. లగడపాటి సర్వే ప్రకారం బీజేపీకి 110 నుంచి 120 సీట్లు, కాంగ్రెస్కు 70 నుంచి 80, జేడీఎస్కు నలభై వరకు సీట్లు వస్తాయని తేలిందట. ఈ ఫలితాలను ఆయన అధికారికంగా వెల్లడించలేదని అంటున్నారు. మొదట కాంగ్రెస్ సులభంగా గెలుస్తుందని అందరూ భావించినా, బీజేపీ కూడా పుంజుకోవడం గమనార్హం.