ఇదేనా! మీరు చేసేది: ఆ ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యేలపై బాబు ఆగ్రహం
గుడివాడ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, గుంటూరు జిల్లా బాపట్లకు చెందిన ఎమ్మెల్సీ అన్నం సతీష్లపై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
విజయవాడ: గుడివాడ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, గుంటూరు జిల్లా బాపట్లకు చెందిన ఎమ్మెల్సీ అన్నం సతీష్లపై ఏపీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబునాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. శనివారం ఉదయం తెలుగుదేశం పార్టీ ముఖ్యనేతలో సీఎం చంద్రబాబు తన నివాసంలో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా ఇద్దరు నేతల వ్యహారం చర్చకు వచ్చినట్లు సమాచారం. దీంతో రావి వెంకటేశ్వర రావు, అన్నం సతీష్ల తీరుపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. శ్రీలంక పర్యటన తర్వాత ఇద్దరు నేతలు తక్షణమే వచ్చి తనను కలవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. పార్టీ, ప్రభుత్వ ప్రతిష్ఠ దెబ్బతినేలా వ్యవహరిస్తే ఎవర్నీ ఉపేక్షించవద్దని చంద్రబాబు సూచించినట్లు సమాచారం.

రెండ్రోజుల క్రితం గుడివాడ క్లబ్లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు తుపాకి మిస్ఫైర్ అయిన విషయం తెలిసిందే. కాగా, బాపట్ల సూర్యలంక బీచ్ రిసార్ట్స్లో శుక్రవారం రాత్రి ఎమ్మెల్సీ అన్నం సతీష్, ఆయన అనుచరులు పర్యాటకశాఖ డిప్యూటీ మేనేజర్, సిబ్బంది దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.
ఈ నేపథ్యంలో ఇద్దరు నేతలను చంద్రబాబు తీవ్రంగా మందలించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు ఘటనలపై నివేదికలు సమర్పించాలని ఆయన ఆదేశించినట్లు తెలిసింది. ఇలాంటి ఘటనలను మధ్యలోనే తుంచకపోతే పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. నేతలు ప్రజలతో మమేకం కావాలని గానీ, ఇలాంటి చర్యలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. దీంతో వారిద్దరిపై సీరియస్ చర్య ఏమైనా తీసుకుంటారా? అనే విషయంపై పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
కాగా, శనివారం సాయంత్రం చంద్రబాబును కలిసిన రావి ఘటనపై వివరణ ఇచ్చారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటానని తెలిపారు. ప్రతిపక్ష నేతల్లా ఉండొద్దని ఈ సందర్భంగా చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది.












Click it and Unblock the Notifications