అశ్లీలనృత్యాలు, డ్రగ్స్, కేసినోకల్చర్ లో ఏపీ మొదటి స్థానంలో: గుడివాడ మంత్రిపైనా చంద్రబాబు ధ్వజం
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పై, ఏపీ లోని వైసీపీ సర్కార్ పాలన పై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అమరావతిలోని టిడిపి పార్టీ కార్యాలయంలో పార్టీ సీనియర్ నేతలతో సమావేశమైన చంద్రబాబు నాయుడు ఏపీలో రాజకీయ పరిస్థితులపై చర్చించారు. రాష్ట్రంలో తాజాగా చోటు చేసుకున్న అనేక పరిణామాలపై ఆయన ఏపీ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు.
ఏపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు ప్రజా క్షేత్రంలో ఎండగట్టండి
జగన్ సర్కార్ అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను క్షేత్రస్థాయిలో ఎండగట్టాలని ఆయన పార్టీ నేతలకు సూచించారు. అక్రమ కేసులు ఎవరు భయపడవద్దని, పార్టీ కార్యకర్తలకు నేతలకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని చంద్రబాబు నాయుడు వెల్లడించారు. అధికార పార్టీ అరాచకాలను ప్రజాక్షేత్రంలో ఎండగట్టాలని, తెలుగుదేశం పార్టీ శ్రేణులు భయపడాల్సిన అవసరం లేదని చంద్రబాబు స్పష్టం చేశారు.
కరోనా సమయంలో ఏపీలో విద్యార్థుల ప్రాణాలు పణంగా పెడతారా?
కరోనా దృష్ట్యా 12కు పైగా రాష్ట్రాలలో స్కూళ్ళు మూసివేశారని చెప్పిన చంద్రబాబు ఏపీలో విద్యార్థుల ప్రాణాలను పణంగా పెట్టి స్కూళ్ళు పెట్టడం దారుణమని, ఇది దుర్మార్గమైన చర్య అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్కూళ్ళలో తరగతులను తక్షణమే వాయిదా వేయాలని చంద్రబాబు సూచించారు. పాఠశాలల నిర్వహణ పై సీఎం జగన్ మోహన్ రెడ్డి మూర్ఖంగా వ్యవహరించడం దారుణం అని టిడిపి అధినేత చంద్రబాబు మండిపడ్డారు. వర్షాలకు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ధాన్యం కొనుగోలు డబ్బులు వెంటనే చెల్లించాలని చంద్రబాబు పేర్కొన్నారు.
తిరుపతి ఎయిర్ పోర్ట్ ఘటన వైసీపీ ఉన్మాదానికి పరాకాష్ట
పంట నష్టపోయిన రైతులను తక్షణమే ఆదుకోవాలన్నారు. ధాన్యం డబ్బులను సకాలంలో చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు విషయంలోనూ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని చంద్రబాబు మండిపడ్డారు. గ్రామ సచివాలయ ఉద్యోగుల పోరాటానికి అండగా నిలవాలని టిడిపి శ్రేణులకు పిలుపునిచ్చారు చంద్రబాబు. తిరుపతి రేణిగుంట ఎయిర్ పోర్ట్ కు నీటి సరఫరా నిలిపి వేయడం వైసీపీ ఉన్మాదానికి పరాకాష్ట అని చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైసీపీ ప్రభుత్వం అశ్లీల నృత్యాలు, డ్రగ్స్, కేసినో కల్చర్ లో ఏపీని మొదటి స్థానంలో నిలబెట్టింది
తెలుగుదేశం పార్టీ హయాంలో పారిశ్రామిక అభివృద్ధిలో ఏపీ నెంబర్ వన్ గా నిలిచింది అని పేర్కొన్న చంద్రబాబు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అశ్లీల నృత్యాలు, డ్రగ్స్, కేసినో కల్చర్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మొదటి స్థానంలో నిలబెట్టింది అంటూ ఎద్దేవా చేశారు. గుడివాడలో కేసినో నిర్వహించిన మంత్రి అందుకు బాధ్యులైన పోలీస్ అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. జగన్ రెడ్డి హయాంలో గోవా కేసినో కల్చర్, పేకాట క్లబ్బులు, డ్రగ్స్, గంజాయి పెరిగిపోయాయని చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు.