ఎన్నికల బహిష్కరణ- జగన్‌ను గెలిపించిన అస్త్రం- చంద్రబాబుకు పనికొస్తుందా ?

ఏపీలో త్వరలో జరిగే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను బహిష్కరించాలన్న టీడీపీ నిర్ణయం ఇప్పుడు కాకరేపుతోంది. అధికార వైసీపీకి లబ్ది చేకూర్చేలా పాత నోటిఫికేషన్‌తోనే పరిషత్‌ పోరును నిర్వహించాలన్న ఎస్‌ఈసీ నీలం సాహ్నీ నిర్ణయాన్ని నిరసిస్తూ టీడీపీ ఈ ఎన్నికలను బహిష్కరించింది. అయితే టీడీపీ నిర్ణయంపై విమర్శలకు దిగుతున్న వైసీపీ నేతలు.. గతంలో జగన్ కూడా పలు ఎన్నికలను బహిష్కరించిన విషయాన్ని మర్చిపోతున్నారు. అయితే ఇలాంటి నిర్ణయాలు అన్నిసార్లూ ఫలిస్తాయా అంటే అవునని కచ్చితంగా చెప్పలేని పరిస్ధితి. దీంతో ఈసారి చంద్రబాబు తీసుకున్న నిర్ణయం సరైందా కాదా అనే చర్చ రాష్ట్రంలో సాగుతోంది.

 టీడీపీ పరిషత్‌ పోరు బాయ్‌కాట్ నిర్ణయం

టీడీపీ పరిషత్‌ పోరు బాయ్‌కాట్ నిర్ణయం

ఏపీలో పాత నోటిఫికేషన్ ప్రకారం పరిషత్‌ ఎన్నికలు నిర్వహించాలని ఎస్ఈసీ నీలం సాహ్నీ హడావిడిగా తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ విపక్ష టీడీపీ ఈ ఎన్నికలను బహిష్కరించింది. ఓవైపు కోర్టుల్లో న్యాయపోరాటం చేస్తూనే మరోవైపు ప్రజల్లోకి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్లాలని టీడీపీ అధినేత చంద్రబాబు భావిస్తున్నారు. అయితే ఈ సంచలన నిర్ణయంపై అప్పుడే సొంత పార్టీలో అసంతృప్తి వ్యక్తమవుతోంది. అశోక్‌ గజపతి రాజు వంటి సీనియర్‌ నేత ఈ నిర్ణయాన్ని తప్పుబట్టగా.. మరో సీనియర్‌ నేత జ్యోతుల నెహ్రూ పార్టీ ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. దీంతో ఇప్పుడు చంద్రబాబు నిర్ణయం కరెక్టా కాదా అన్న చర్చ ఊపందుకుంటోంది.

జగన్‌ బాటలోనే చంద్రబాబు

జగన్‌ బాటలోనే చంద్రబాబు


గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో పోటీ పడే పరిస్ధితులు లేనప్పుడు వైసీపీ అధినేతగా ఉన్న జగన్‌ పలు ఎన్నికలను బహిష్కరించారు. ఇందులో 2013, 2015లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలను వైసీపీ బాయ్‌ కాట్‌ చేసింది. 2013లో జరిగిన సహకార సంఘాల ఎన్నికలను సైతం వైసీపీ బహిష్కరించింది. ఎలాంటి కారణాలు చెప్పకుండానే తెలంగాణలో జరిగిన పలు ఎన్నికలకు వైసీపీ దూరంగా ఉండిపోయింది. ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు తొలిసారిగా ఓ ఎన్నికలను బహిష్కరించారు. అయినా రాజకీయాల్లో అత్యంత సీనియర్‌ నేతగా చెప్పుకునే చంద్రబాబు.. జగన్‌ బాటలోనే ఎన్నికల బాయ్‌కాట్‌కు వెళ్లడంపై భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి.

ఎన్నికల బహిష్కరణతో జగన్‌ సాధించింది ఇదే..

ఎన్నికల బహిష్కరణతో జగన్‌ సాధించింది ఇదే..

గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో తాము స్వేచ్ఛగా పోటీ చేసే అవకాశం ఇవ్వడం లేదనే కారణంతో పలు ఎన్నికలను జగన్‌ బహిష్కరించారు. ఓ దశలో టీడీపీ వైఖరిని నిరసిస్తూ అసెంబ్లీకి సైతం వెళ్లడం మానేశారు. అప్పట్లో జగన్ నిర్ణయాలపై సాధారణ జనంలో సైతం తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. టీడీపీ సైతం ప్రజల డబ్బును జీతాలుగా తీసుకుంటూ అసెంబ్లీకి రాకపోవడంపై వైసీపీ ఎమ్మెల్యేలను పదేపద టార్గెట్‌ చేసేది. అయినా చివరికి వైసీపీ అధినేత జగన్ తాను అనుకున్న స్ధాయిలో సానుభూతి తెచ్చుకోగలిగారు. వైసీపీని టీడీపీ వేధించడం వల్లే ఈ నిర్ణయాలు తీసుకున్నాననే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి సార్వత్రిక ఎన్నికల్లో ఘనవిజయాన్ని అందుకున్నారు.

చంద్రబాబు వ్యూహం కూడా అదేనా ?

చంద్రబాబు వ్యూహం కూడా అదేనా ?

గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో పలు ఎన్నికలు బహిష్కరించినా వైసీపీకి ప్రజలు పట్టం గట్టారు. అంటే ఎన్నికల బహిష్కరణ అనేది తాత్కాలికంగా చర్చనీయాంశమే తప్ప అంతిమంగా అది రాజకీయ పార్టీలపై పెను ప్రభావం చూపదన్న అంశం గతంలో నిర్ధారణ అయింది. ఇప్పుడు తాము ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు బహిష్కరించినా ప్రజలు కొన్ని రోజులు దీనిపై చర్చించుకుంటారు. ప్రజల్లోకి వెళ్లి ఇందుకు గల కారణాలను వివరించగలిగితే అది అంతిమంగా తమకే లబ్ది చేకూరుస్తుందన్న అంచనాలో చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే విమర్శలు ఎదురైనా, జగన్ బాటలోనే వెళ్తున్నారన్న నింద పడుతున్నా వెరవకుండా పరిషత్ పోరును బాయ్‌కాట్‌ చేసినట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+