మరో జగన్ ఐడియాకు కూటమి చెక్? బీజేపీ అండతో అమల్లోకి..!
ఏపీలో కూటమి ప్రభుత్వం గత వైసీపీ తాలూకు గుర్తులన్నీ వరుసగా చెరిపేస్తోంది. అలాగే గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలన్నీ తిరగతోడి వాటి ఆనవాళ్లు లేకుండా చేసేందుకు వేగంగా పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా తాజాగా ఓ కీలక అంశంలో వేగంగా నిర్ణయాలు జరిగిపోతున్నాయి. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ ఏడాది చివరి లోపే ఆ ఐడియా అమల్లోకి రానుంది. అదే జరిగితే మరో వైసీపీ గుర్తు చెరిగిపోయినట్లే అని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
రాష్ట్రంలో గత వైసీపీ ప్రభుత్వం అమరావతి రాజధాని స్ధానంలో మూడు రాజధానులు తెచ్చేందుకు తీవ్ర ప్రయత్నాలు చేసింది. ఇందులో భాగంగా విశాఖలో కార్వనిర్వాహక రాజధాని, అమరావతిలో శాసన రాజధాని, కర్నూల్లో న్యాయ రాజధాని ఏర్పాటు చేస్తామని ప్రతిపాదించింది. వీటిలో ఏ ఒక్కటీ అమలు కాకుండానే ప్రభుత్వం మారిపోయింది. దీంతో ఇప్పుడు ఆ ప్రయత్నాలకు పూర్తిగా చెక్ పెట్టేందుకు కూటమి ప్రభుత్వం పక్కాగా పావులు కదుపుతోంది.

మూడు రాజధానుల్లో న్యాయ రాజధానిగా వైసీపీ ప్రభుత్వం ఎంచుకున్న కర్నూల్లో హైకోర్టు బెంచ్ పెట్టేందుకు కూటమి ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. ఇందుకు అనుగుణంగా భవనాలు, ఇతర సౌకర్యాల ఏర్పాటుకు ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఇప్పటికే అధికారులు ఆ పనిలో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ నెల 6న హైకోర్టు న్యాయమూర్తుల బృందం కర్నూలు వెళ్లి ఈ భవనాలు, సదుపాయాల పరిశీలన చేయబోతోంది. అనంతరం ఏపీ ప్రభుత్వం, హైకోర్టు కలిసి ఈ ప్రతిపాదన సుప్రీంకోర్టు ముందు పెట్టి ఆమోదం తీసుకుంటాయి. అనంతరం కేంద్రం దీనిపై గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయనుంది.
ప్రస్తుత పరిస్ధితుల్లో ఇవన్నీ అనుకొన్నవి అనుకున్నట్లు జరగడంలో ఎలాంటి ఇబ్బందులూ లేవు. ఎందుకంటే కేంద్ర, రాష్టాల్లో కూటమి ప్రభుత్వాలే అధికారంలో ఉన్నాయి. అలాగే కర్నూల్లో హైకోర్టు బెంచ్ కు బీజేపీ కూడా అంగీకరించింది. దీంతో హైకోర్టు, సుప్రీంకోర్టు సహకారంతో కర్నూల్లో హైకోర్టు బెంచ్ ఏర్పాటు కావడం ఖాయం. అయితే కార్యనిర్వాహక పరంగా చేపట్టాల్సిన చర్యల వల్ల ఈ ఏడాది చివరి నాటికి ఈ ఐడియా కార్యరూపం దాల్చబోతోంది. అదే జరిగితే జగన్ న్యాయ రాజధానికి శాశ్వతంగా చెక్ పడినట్లే.












Click it and Unblock the Notifications