చంద్రబాబు దళిత ద్రోహి..ఆయనది మొసలి కన్నీరు: మహిళా మంత్రుల ఫైర్
రాష్ట్రంలో దళితులపై దాడులు పెరిగిపోయాయని,దళితులపై దాడులు జరగకుండా ఒక్క రోజైనా గడుస్తున్నాయా అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీ ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు.ఉన్మాదుల పాలనకు ఈ దాడులు పరాకాష్టగా నిలిచాయని, వైసిపి ప్రభుత్వ హయాంలో దళితులకు రక్షణ లేదని చంద్రబాబుతో పాటు,టిడిపి నేతలు విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా మంత్రులు పుష్ప శ్రీవాణి, తానేటి వనిత చంద్రబాబు తీరుపై మండిపడ్డారు.
గతంలో దళితులను హేళన చేశారని మండిపడిన డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి
ఎస్సీ,ఎస్టీల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదని ఏపి డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి నిప్పులు చెరిగారు. గతంలో చంద్రబాబు దళితులను ఉద్దేశించి మాట్లాడిన వ్యాఖ్యలను, ఆయన దళితులను అవమానించిన తీరును గుర్తు చేసిన పుష్పశ్రీవాణి ఎస్సీలుగా పుట్టాలనుకుంటున్నారా ? అంటూ చంద్రబాబు ఎస్సీలను అవమానించిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. ఎస్సీ, ఎస్టీలకు తెలివి ఉండదని చంద్రబాబు నాడు హేళన చేశారని పేర్కొన్నారు. చంద్రబాబుని చూసి ఎస్సీ ఎస్టీల అసహ్యించుకుంటున్నారని డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి తెలిపారు
వైసీపీ హయాంలో దళితులకు పలు సంక్షేమ పథకాలు ఇచ్చామన్న పుష్ప శ్రీవాణి
ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీల కోసం పలు సంక్షేమ పథకాలు అందిస్తున్నారని, కోటి 13 లక్షల మందికి సంక్షేమ పథకాలు అందించిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డి దేనని పేర్కొన్నారు. చంద్రబాబు దళిత ద్రోహి అని అభివర్ణించారు. దళితులు ,గిరిజనుల పై దాడులు జరిగితే ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు గా మంత్రి పుష్ప శ్రీవాణి వెల్లడించారు. ఎస్సీ ఎస్టీలకు ఏడాదిలోనే 13 వేల కోట్ల సంక్షేమ నిధులు అందించామని డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి తెలిపారు.
చంద్రబాబుకు దళితులు గుణపాఠం చెప్తారన్న మంత్రి తానేటి వనిత
ఇదే సమయంలో చంద్రబాబుకు దళితులు గుణపాఠం చెప్తారని మంత్రి తానేటి వనిత చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. ఏపీలో కుల రాజకీయాలు చేస్తూ కావాలని దళితుల పేరుతో బాబు కుట్ర చేస్తున్నాడని ఆమె పేర్కొన్నారు. ఏనాడు దళితులను టీడీపీ హయాంలో పట్టించుకున్న దాఖలాలు లేవని మంత్రి తానేటి వనిత అభిప్రాయపడ్డారు. చంద్రబాబు దళిత ద్రోహి అని ఫైర్ అయిన ఆమె దళితులపై చంద్రబాబు మొసలి కన్నీరు అంటూ విమర్శల వర్షం కురిపించారు. సీఎం జగన్ పాలన చూసి తట్టుకోలేక చంద్రబాబు కుల రాజకీయాలకు తెర తీశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Recommended Video
ఏపీలో దళితుల వ్యవహారంలో దుమారం ... అధికార ప్రతిపక్షాల మాటల యుద్ధం
ఇప్పటికే టీడీపీ నేతలు ఏపీలో వైసీపీ హయాంలో దళితులకు శిరోముండనం ఘటనలు పెరిగిపోయాయని, దాడులు కొనసాగుతున్నాయని, బెదిరింపులకు పాల్పడి భయబ్రాంతులకు గురి చేస్తున్నారని విమర్శల వర్షం కురిపిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఎదురుదాడి చేస్తూ వైసీపీ మంత్రులు, వైసిపి ఎంపీలు, ఎమ్మెల్యేలు చంద్రబాబు పై, టిడిపి నాయకుల పై నిప్పులు చెరుగుతున్నారు. తాజాగా మహిళా మంత్రులు చంద్రబాబు కుల రాజకీయాలపై భగ్గుమన్నారు.