స్విస్ బ్యాంకులో ఖాతాలు: చంద్రబాబుపై చెవిరెడ్డి
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బుధవారం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబుకు స్విస్ బ్యాంకులో ఖాతాలున్నాయని ఆరోపించారు.
దావోస్ పర్యటనలో ఉన్న చంద్రబాబు, అక్కడ్నుంచి స్విట్జర్లాండ్ ఎందుకు వెళ్తున్నట్లో అంటూ సందేహం వ్యక్తం చేశారు. దీన్ని బట్టి చంద్రబాబుకు స్విస్ బ్యాంకు ఖాతాల్లో డబ్బులు ఉన్నాయనే అనుమానాలు కలుగుతున్నాయని అన్నారు. స్విస్ బ్యాంకులోని ఖాతాల్లో నగదును చెక్ చేసుకోవడానికి చంద్రబాబు స్విట్జర్లాండ్ వెళ్తున్నట్లున్నారని చెవిరెడ్డి ఎద్దేవా చేశారు.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ ఇవ్వడం ఇష్టం లేక జీతాలకు డబ్బుల్లేవంటూ చంద్రబాబు బీద అరుపులు అరుస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు ప్రభుత్వం జనవరి 7న మంత్రులు, ఉన్నతాధికారులతో జరిగిన సమావేశంలో రాష్ట్రంలో రూ. 375 కోట్ల మిగులు బడ్జెట్ ఉందని ప్రకటించిందని చెవిరెడ్డి గుర్తుచేశారు. కానీ, ఇప్పుడు ఉద్యోగులకు జీతాలు లేవని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
రాష్ట్రంలో మిగులు బడ్జెట్ను సిఎం చంద్రబాబు ప్రత్యేక విమాన పర్యటనలకే ఖర్చు చేస్తారా? అని చెవిరెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయంటూ చెబుతున్న చంద్రబాబు.. ప్రత్యేక విమానాల్లో పర్యటించడం ఎంతవరకు సమంజసమని అన్నారు.
ఎన్టీఆర్ను పొగిడితే అసహ్యించుకుంటారు: బాబుపై గౌతం
దివంగత నేత ఎన్టీఆర్ను పదవి నుంచి దించివేసి ఆయన మరణానికి కారకుడైన సిఎం చంద్రబాబునాయుడు.. ఇప్పుడు ఎన్టీఆర్ను పొగిడితే ప్రజలు అసహ్యించుకుంటారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ పూనూరి గౌతంరెడ్డి విమర్శించారు. పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి ఆయన్ని అనేక ఇబ్బందులకు గురిచేసిన చంద్రబాబు ఇప్పుడు ఊసరవెల్లిగా మారి ఆయన్ని కీర్తించడం హాస్యాస్పదంగా ఉందన్నారు.