దుబాయ్ నుంచే వర్షాలపై చంద్రబాబు సమీక్ష..! ఎమర్జెన్సీ నిధుల రిలీజ్..!
ఏపీలో భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇప్పటికే పలు జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్స్ కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన సీఎం చంద్రబాబు దుబాయ్ లో, మంత్రి నారా లోకేష్ ఆస్ట్రేలియా పర్యటనలో పెట్టుబడుల వేటలో ఉన్నారు. ఈ నేపథ్యంలో హోంమంత్రితో పాటు ఇతర మంత్రులు సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇవాళ సీఎం చంద్రబాబు దుబాయ్ నుంచే భారీ వర్షాలపై టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై దుబాయ్ నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు.. మంత్రులు, అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. వర్షప్రభావిత జిల్లాలు నెల్లూరు, ప్రకాశం, కడప, తిరుపతి, అన్నమయ్య తదితర జిల్లాల పరిస్థితిపై మంత్రులు, సీఎస్, కలెక్టర్లు, ఆర్టిజీఎస్ అధికారులతో సీఎం మాట్లాడారు. అల్పపీడనం ప్రభావంతో భారీ వర్షాల నేపథ్యంలో జిల్లాల్లో యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

భారీవర్షాల కారణంగా తీవ్రంగా ప్రభావితం అయిన నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం జిల్లాలకు రూ.2 కోట్ల చొప్పున, మిగతా వర్ష ప్రభావిత జిల్లాలకు రూ.1 కోటి చొప్పున అత్యవసర నిధులు మంజూరు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. కడప, నెల్లూరు, ప్రకాశం, తిరుపతి జిల్లాలకు ఎస్డీఆర్ బృందాలను, నెల్లూరు జిల్లాలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలను తక్షణం మొహరించాలని సూచించారు. ఎక్కడా ప్రాణ, ఆస్తి నష్టం జరక్కుండా చర్యలు తీసుకోవాలని సీఎం దిశానిర్దేశం చేశారు. రెవెన్యూ, డిజాస్టర్, పోలీస్, ఇరిగేషన్, మున్సిపల్, రహదారులు, భవనాలు, విద్యుత్ శాఖలు సమన్వయంతో పనిచేయాలనీ ముఖ్యమంత్రి సూచించారు.

భారీ వర్షాలతో నీట మునిగిన లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. పునరావాస కేంద్రాల్లో బాధితులకు ఆహారం, పిల్లలకు పాలు లాంటి ఆహారపదార్ధాలను అందుబాటులో ఉంచాలన్నారు. దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలలో ఇప్పటికే కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసినట్టు జిల్లా కలెక్టర్లు ముఖ్యమంత్రికి తెలిపారు. తీవ్ర వర్షాల కారణంగా కాలువ, చెరువు గట్లకు గండ్లు పడకుండా బలహీనంగా ఉన్న చోట్ల పటిష్ట పరచాలని సీఎం అధికారులకు సూచించారు. అంటువ్యాధులు వ్యాపించకుండా వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా చూడాలన్నారు. అలాగే పంట నష్టం జరక్కుండా చూడాలన్నారు. ఎగువ నుంచి వస్తున్న నీటి ప్రవాహాలతో చెరువులు నింపేందుకు చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు.












Click it and Unblock the Notifications