రాజమౌళితో చంద్రబాబు: అమరావతి ఎలా ఉండాలంటే...
Recommended Video
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిలో పరిపాలనా నగరానికి సంబంధించి డిజైన్లపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో ప్రముఖ సినీ దర్శకుడు రాజమౌళి సమావేశమయ్యారు. ఆదివారం హైదరాబాదులో ఈ భేటీ జరిగింది.
రాజధాని నగరానికి సంబంధించి నార్మన్ ఫోస్టర్ సంస్థ బృందం అందచేసిన డిజైన్లపై వారిద్దరు చర్చించారు. పరిపాలనా నగరం, శాసనసభ భవనాలకు సంబంధించి కొన్ని డిజైన్లను ఆయన పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా ముఖ్యమంత్రికి వివరించారు.
వాటి మేళవింపుగా...
రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలు, ఆధునికతల మేళవింపుగా రాజధాని నగరం ఉండాలని భావిస్తున్నట్లు చంద్రబాబు రాజమౌళితో చెప్పారు. ఇప్పటికే నార్మన్ ఫోస్టర్ ఇచ్చిన డిజైన్లకు కొన్ని మార్పులను రాజమౌళి సూచించారు.
ఆ తర్వాత సిఆర్డిఎ అధికారులతో చర్చలు..
రాజమౌళితో భేటీ తర్వాత సీఆర్డీఏ అధికారులతో జరిపిన సమీక్షా సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. వెంకటపాలెం నుంచి దొండపాడు వరకూ నిర్మిస్తున్న స్పీడ్ యాక్సెస్ రోడ్డు పనులను వచ్చే జనవరి 15నాటికి పూర్తిచేయాలని ఆదేశించారు.
రహదారుల పనుల్లో వేగం...
రాజధాని పరిధిలో చేపట్టిన ఏడు ప్రాధాన్య, మరో 3 అదనపు రహదారుల పనుల వేగం పెంచాలని, ఈ రహదారుల నిర్మాణం పూర్తయితే రాజధానికి తొలిరూపు వస్తుందని చంద్రబాబు అన్నారు. అమరావతి పరిధిలో చేపట్టనున్న వివిధ గృహ సముదాయాల నిర్మాణాలు పూర్తయ్యేందుకు కూడా గడువు విధించారు.
వారి గృహాల సముదాయం ఇలా...
శాసన సభ్యులు, ఐఏఎస్ అధికారులు ఉండే నివాస గృహాల సముదాయాన్ని 2019 ఫిబ్రవరి నాటికి పూర్తిచేయాలని చంద్రబాబు ఆదేశించారు. నేలపాడు, శాఖమూరు, అనంతవరం, నెక్కల్లు, తుళ్లూరు, తదితర ప్రాంతాల్లో 76.5 కిలోమీటర్ల రోడ్డు పనులను 2020 నవంబర్ 17లోగా, జోన్-2 పరిధిలోని కొండమరాజుపాలెం, రాయపూడి, తదితర ప్రాంతాల్లోని 64 కిలోమీటర్ల రోడ్లను 2010 నవంబర్ 16 నాటికి పూర్తి చేయాలని కూడా చంద్రబాబు సీఆర్డీఏను ఆదేశించారు.