బాబు ప్రమాణానికి మోడీ వస్తారా? పవన్ సహా సిఎంలు
హైదరాబాద్: తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఆహ్వానించాలని చంద్రబాబు నిర్ణయించారు. జూన్ 8న విజయవాడ - గుంటూరు నగరాల నడుమ ప్రజల మధ్య బాబు ప్రమాణ స్వీకారం చేయనున్న విషయం విదితమే. ఈ కార్యక్రమ ఏర్పాట్లపై గురువారం ఆయన గుంటూరు, కృష్ణా జిల్లాల పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తన ప్రమాణానికి మోడీని ఆహ్వానిస్తున్నట్లు బాబు తెలిపారు.
అయితే, పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నందున మోడీ రాగలుగుతారా అన్న సందేహాన్ని సమావేశంలో పాల్గొన్న నేతలు వ్యక్తం చేయగా, స్వయంగా తానే మోడీని కలిసి ఆహ్వానిస్తానని బాబు తెలిపారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఢిల్లీ వెళ్లారు. మోడీతోపాటు పలువురు కేంద్ర మంత్రులను కలిసి కొత్త రాష్ట్ర అవసరాలపై కూడా మాట్లాడాలన్న యోచనలో బాబు ఉన్నారు. వారిలో కొందరిని తన ప్రమాణానికి ఆహ్వానించనున్నారు.

ఇటీవల ఎన్నికల్లో టిడిపి అభ్యర్థుల తరఫున ప్రచారం చేసిన సినీ నటుడు పవన్ కళ్యాణ్నూ ప్రమాణస్వీకారానికి చంద్రబాబు ఆహ్వానించనున్నారు.
బాబు ప్రమాణస్వీకారానికి నలుగురు ముఖ్యమంత్రులను కూడా ఆహ్వానించనున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ ఆహ్వానితుల జాబితాలో ఉన్నారు. ప్రస్తుతానికి ఆహ్వానితుల జాబితాలో కెసిఆర్ లేరని సమాచారం.












Click it and Unblock the Notifications