ఏపీ అసెంబ్లీ లోటస్ పాండ్ ను తలపిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న బాబు .. కాలినడకన టీడీపీ నిరసన
Recommended Video
ఏపీ అసెంబ్లీ జరుగుతున్న తీరుపై ప్రతిపక్ష పార్టీ నేత మాజీ సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో శాసనసభ సమావేశాలు ప్రజాస్వామ్య బద్ధంగా జరగడం లేదని ఆయన ఆరోపించారు. ఇక ఏపీ శాసనసభ లోటస్ పాండ్ ను తలపిస్తుందని చంద్రబాబు మండిపడ్డారు.
ఏపీలో శాసనసభ నిర్వహణ తీరుపై అసంతృప్తితో ఉన్న టీడీపీ ముగ్గురు టీడీపీ సభ్యులను సస్పెండ్ చేసిన నాటి నుండి ఆందోళన పర్వాన్ని కొనసాగిస్తోంది.

ఏపీ శాసన సభా నిర్వహణ తీరుపై టీడీపీ అసంతృప్తి .. కాలినడకన ప్లకార్డులతో నిరసన
స్పీకర్ తమ్మినేని సీతారాం ముఖ్యమంత్రి వైయస్ జగన్ కనుసన్నలతో సభను నడిపిస్తున్నారని టిడిపి ఆరోపిస్తోంది. ప్రజాస్వామ్యయుతంగా శాసనసభ నడవడం లేదని టిడిపి అధినేత, మాజీ సీఎం చంద్రబాబు మండిపడుతున్నారు. ఇక ఈ నేపథ్యంలో తమ నిరసన తెలియజేసేలా కాలినడకన అసెంబ్లీ కి ,శాసన మండలికి టిడిపి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు తమ నిరసన తెలియజేస్తూ ప్లకార్డులను ప్రదర్శిస్తూ వెళ్లారు. సభలో టీడీపీ సభ్యుల సస్పెన్షన్, విపక్షాలకు మైక్ ఇవ్వకపోవడంపై నినాదాలు చేస్తూ ఉభయ సభలకు వెళ్లారు టిడిపి నాయకులు. తమ అసంతృప్తిని శాసనసభ శాసనమండలి వేదికగా తెలియజేశారు.
ప్రతిపక్షాల గొంతు నొక్కటమే లక్ష్యంగా వైసీపీ ..జగన్ కనుసన్నలలోనే స్పీకర్ సభ నిర్వహణ
ప్రతిపక్ష పార్టీల గొంతు నొక్కడం లక్ష్యంగా పెట్టుకొని వైసిపి సభలో ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్న పార్టీ వైసీపీ అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శలు గుప్పించారు. తనను మాట్లాడకుండా చేయడానికి వైసీపీ ఎమ్మెల్యేలను మూకుమ్మడిగా తమపై దాడికి దించుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ్యుల హక్కులను కాపాడే విధంగా స్పీకర్ ప్రవర్తించడం లేదని, సభను నడిపిస్తుంది స్పీకరా లేక ముఖ్యమంత్రినా అని ప్రశ్నించారు చంద్రబాబు. ఇప్పటికైనా స్పీకర్ ఏకపక్ష వైఖరిని విడనాడాలని, సభా వేదికగా టిడిపి పై జరుగుతున్న దాడులను అరికట్టాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.

తను మాట్లాడకుండా వైసీపీ సభ్యులతో తిట్టించే అజెండాతో ఉన్న వైసీపీ సర్కార్ .. ప్రజా క్షేత్రంలో తేల్చుకుంటాం అన్న బాబు
సమావేశాలకు ముందు బీఏసీ మీటింగ్ లో అన్ని పార్టీలు సమానమేనని అందరికి మాట్లాడడానికి అవకాశం ఇస్తామని చెప్పిన వైసిపి ఇప్పుడు సభలో మాట్లాడనీయకుండా అడ్డుపడుతుందని చంద్రబాబు ఆరోపించారు. జగన్ ప్రజలకిచ్చిన హామీలను విస్మరిస్తున్నారని, ఆ విషయాన్ని గుర్తు చేద్దామని ప్రయత్నం చేస్తే ఒకరికి పదిమంది మాటల దాడికి దిగుతున్నారని చంద్రబాబు ఆరోపించారు. తాను సభలో మాట్లాడకూడదని, అందుకే వైసిపి సభ్యులతో తిట్టించే అజెండాతో వైసిపి ముందుకెళ్తుందని చంద్రబాబు ఆరోపించారు. ప్రజా సమస్యలపై కూడా మాట్లాడనీయకుండా అడ్డుపడుతున్న ప్రభుత్వ వైఖరిని ప్రజా క్షేత్రంలో ఎండగడతామని చంద్రబాబు తేల్చి చెప్పారు












Click it and Unblock the Notifications