బాబులో వణుకు అందుకే, బంగాళాఖాతంలోనే: నంద్యాల ప్రజలపై జగన్
నంద్యాల: నంద్యాల ఉపఎన్నిక చివరి రోజు ప్రచారంలోనూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబునాయుడుపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అంటేనే సీఎం వెన్నులో వణుకు పుడుతోందని పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి అన్నారు.
బంగాళా ఖాతంలో కలపండి..
తెలుగుదేశం పార్టీని బంగాళాఖాతంలో కలపాలని ప్రజలకు జగన్ పిలుపునిచ్చారు. నంద్యాల ప్రజల ఆదరాభిమానాలు చూస్తుంటే చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రచారం చివరిరోజు సోమవారం సాయంత్రం గాంధీచౌక్లో జగన్ మాట్లాడారు.
Recommended Video
చంద్రబాబులో వణుకు
‘13 రోజులుగా గ్రామాలు, పట్టణంలోని వార్డుల్లో తిరిగాను. మీరు పంచిన ఆత్మీయతను చూశాను. నేనొక్కడినే కాదు.. రాష్ట్రం మొత్తం కూడా చూసింది ఆ ఆత్మీయత' అని జగన్ కొనియాడారు. మీ ఆత్మీయత, అభిమానం చూసి చంద్రబాబు వెన్నులో వణుగుపుట్టిందన్నారు. అందుకే సిఎంతోపాటు కేబినెట్ మొత్తం ఇక్కడ దిగిందన్నారు.
పెళ్లి రోజు సందడి: సెల్వమణితో రోజా ఇలా, స్వీట్ తినిపించి జగన్ ఆశీర్వాదం
ఎప్పుడైనా చూశారా?
గడిచిన మూడున్నర సంవత్సరాల్లో చంద్రబాబును నంద్యాల రోడ్లపై ఎప్పుడైనా చూశారా? అని ప్రశ్నించారు. 15 రోజులుగా నంద్యాలలో జగన్ తిరుగుతున్నాడని ఎద్దేవా చేశారని, నిజానికి తిరగాల్సింది నేను కాదని సిఎం తిరగాలన్నారు. కేవలం ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే కాదని, ఎప్పుడూ ప్రజల మధ్యకు రావాలన్నారు.
ప్రశ్నిస్తే జగన్ మనిషివా? అంటున్నారు..
2014లో నందిగామ నియోజకవర్గం ఎమ్మెల్యే చనిపోతే సానుభూతితో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేయలేదని, ఆ తరువాత చంద్రబాబు నందిగామ ముఖం చూశారా? అని ప్రశ్నించారు. సీఎం కావడానికి ఎవరినీ వదిలిపెట్టలేదన్నారు. ఈ పనిచేయలేదని ఎవరైనా సీఎంను ప్రశ్నిస్తే నీవు జగన్ మనిషివంటూ.. ప్రశ్నించిన వ్యక్తిని భయభ్రాంతులకు గురిచేసే వ్యక్తి చంద్రబాబు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
సెల్పీల సందడి
జగన్మోహన్ రెడ్డి తన నంద్యాల ప్రచారంలో ప్రజలు, యువతతో సెల్ఫీలు దిగారు. జగన్ తో సెల్ఫీలు దిగేందుకు యువతీయువకులు, మహిళలు పోటీ పడ్డారు. జగన్ ఫొటోలను తీసుకున్నారు. జగన్మోహన్ రెడ్డికి షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు యువకులు పోటీపడటం కనిపించింది.