బాబు అబద్ధాల కోరు, ఇంటికెళ్లాల్సిందే: వైయస్ జగన్ నిప్పులు
అనంతపురం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై ప్రతిపక్ష నేత, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి నిప్పులు చెరిగారు. నిస్సిగ్గుగా అబద్ధాలు చెబుతున్న చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్లే సమయం ఆసన్నమైందని ఆయన అన్నారు. అందరం కలిసికట్టుగా చంద్రబాబును ఇంటికి పంపిద్దామని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.
అనంతపురం జిల్లా పూడేరు సర్కిల్లో ఆయన మంగళవారంనాడు జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. చంద్రబాబు అప్పుడు శానససభలో మాట్లాడినప్పుడు రైతులెవరూ ఆత్మహత్యలు చేసుకోలేదని అన్నారని ఆయన గుర్తు చేస్తూ తీరా తాను పరామర్శ యాత్రకు బయలుదేరుతున్నట్లు తెలియగానే ఒక్క అనంతపురం జిల్లాలోనే 26 మంది ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారని అన్నారు.
అప్పుడు చంద్రబాబుకు రైతన్నల ఆత్మహత్యలు గుర్తుకు రాలేదా అని జగన్ ప్రశ్నించారు. ప్రశ్నించేవారు వస్తున్నారంటే తప్ప చంద్రబాబుకు రైతు సమస్యలు పట్టవా అని అడిగారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను గెలిచిన తర్వాత చంద్రబాబు వాటిని మరిచిపోయారని విమర్శించారు. అనంతపురం జిల్లా హంద్రీనీవా నీళ్లు రావడానికి తానే కారణమని చంద్రబాబు చెప్పడం సిగ్గు చేటు అని ఆయన అన్నారు.