చంద్రబాబుది ఓ అబద్దాల ఫ్యాక్టరీ ... రాష్ట్రంలో జరుగుతున్న దాడుల వెనుక టీడీపీ : మంత్రి కన్నబాబు
నిన్నటికి నిన్న టిడిపి అధినేత చంద్రబాబు టిడిపి నాయకుల కార్ఖానా అని చెప్పుకున్నారు. అయితే ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఆయన బృందం అబద్ధాల ఫ్యాక్టరీ పెట్టారని విమర్శలు గుప్పించారు. హిందూ దేవాలయాలపై దాడులు, హిందు విగ్రహాల కూల్చివేత ఘటనలు వెనుక టిడిపి కార్యకర్తలు ఉన్నారంటూ ఆయన విమర్శించారు.
రథం దగ్ధం అయితే చంద్రబాబు ఆనంద తాండవం చేస్తున్నారు .. మంత్రి కన్నబాబు ఫైర్
రైతుల గురించి మాట్లాడే హక్కు చంద్రబాబుకు లేదు
అమరావతిని, కులాన్ని అడ్డుపెట్టుకొని అసత్యాలు చెప్పిన చంద్రబాబు ఇప్పుడు మతం పేరుతో కూడా అబద్దాలు ఆడుతున్నారు అంటూ మండిపడ్డారు. వైయస్ జగన్ మోహన్ రెడ్డి పాలన చూసి ఓర్చుకోలేక చంద్రబాబు కుట్ర చేస్తున్నారంటూ విమర్శించారు మంత్రి కురసాల కన్నబాబు. రైతులకు టిడిపి హయాంలో మేలు చేసినట్లుగా డబ్బా కొట్టుకుంటున్న చంద్రబాబు రైతులకు ఏమాత్రం లాభం చేకూర్చలేదని మండిపడ్డారు. వ్యవసాయం గురించి మాట్లాడే కనీస అర్హత కూడా చంద్రబాబుకు లేదని విమర్శించారు కన్నబాబు.
చంద్రబాబు ప్రతీదీ దుష్ప్రచారం చేస్తున్నారు
రాష్ట్రంలో జరిగే ప్రతి ఒక్క ఘటనపై చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పన్నెండేళ్ల క్రితం సస్పెండైన మెజిస్ట్రేట్ తమ్ముడిపై దాడి జరిగితే మంత్రి పెద్దిరెడ్డి అనుచరులకు సంబంధం ఉన్నట్లుగా చంద్రబాబు చేస్తున్న ప్రచారం దారుణమన్నారు. ఈ దాడి వెనుక టిడిపి హస్తం ఉందని, దాడి చేసిన వ్యక్తి టీడీపీ కార్యకర్త ప్రతాపరెడ్డి అని ఆయన పేర్కొన్నారు. ఇక దీనిపై డీజీపీ రాసిన లేఖకు చంద్రబాబు డీజీపీ పై వాడిన భాష తీవ్ర అభ్యంతరకరమని కురసాల కన్నబాబు వ్యాఖ్యానించారు.
విశాఖ విమానాశ్రయంలో జగన్ పై హత్యాయత్నం .. అప్పుడు చేసిందేమిటి ?
గతంలో విశాఖ విమానాశ్రయంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి పై హత్య ప్రయత్నం జరిగితే, డీజీపీ ప్రెస్ మీట్ పెట్టి టిడిపి నాయకుడిలా మాట్లాడారంటూ గుర్తు చేశారు మంత్రి కన్నబాబు. విజయవాడలో 40 దేవాలయాలను కూల్చి విగ్రహాలను చెత్తకుండీలో పడేసింది, సదావర్తి భూములు పప్పుబెల్లాల్లా ఎవరెవరికో కట్టబెట్టింది ప్రజలందరికీ తెలుసు అంటూ చంద్రబాబుపై మండిపడ్డారు కన్నబాబు. అంతర్వేది ఘటనపై ఎవరు అడగకముందే సిబిఐ విచారణకు ఆదేశించారని గుర్తు చేశారు.
Recommended Video
నోరు తెరిస్తే అబద్ధాలే .. వైఎస్సార్ జలకళపై కూడా అసత్యాలు
వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను చంద్రబాబు తమ పథకాలని ప్రచారం చేసుకుంటున్నారని, చివరకు వైయస్సార్ జలకళను ప్రారంభిస్తే దానిపై కూడా అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో జరిగే ప్రతి ఒక్క దారుణం వెనుక చంద్రబాబు అండ్ గ్యాంగ్ ఉన్నారంటూ నిప్పులు చెరిగారు కురసాల కన్నబాబు. తుని వద్ద రైలు తగలబెట్టటం ఆ తర్వాత గొడవ చేయించటం, అమరావతిలో అరటి తోటల దగ్ధం ఘటనలు అన్నిటికీ చంద్రబాబే కారణం అంటూ ఆరోపణలు గుప్పించారు మంత్రి కురసాల కన్నబాబు.