ఎన్నో హామీలిచ్చా-ఖజానాలో ఏమీ లేదక్కడ-శ్రీశైలంలో జలహారతి వేళ బాబు కామెంట్స్..!
ఏపీలో భారీ వర్షాలు కురుస్తుండటంతో అన్ని రిజర్వాయర్లలోకి భారీగా నీరు వచ్చి చేరుతోంది. ఈ నేపథ్యంలో శ్రీశైలం డ్యామ్ వద్ద కృష్ణానదికి సీఎం చంద్రబాబు ఇవాళ జలహారతి సమర్పించారు. మంత్రులు, అధికారులతో కలిసి జలహారతి సమర్పించిన చంద్రబాబు.. అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన బహిరంగసభలో కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా రాష్ట్రంలో కూటమి సర్కార్ హామీల అమలుపై సందిగ్ధత నెలకొన్న వేళ చంద్రబాబు వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
ఇవాళ శ్రీశైల భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించిన చంద్రబాబు..శ్రీశైలం డ్యాం వద్ద కృష్ణమ్మకు జలహారతి, సారె సమర్పించారు. ఏపీజెన్కో కుడిగట్టు జల విద్యుత్ కేంద్రాన్ని పరిశీలించిన సీఎం..సున్నిపెంట నీటి వినియోగదారుల సంఘం ప్రతినిధులతో ముఖాముఖి మాట్లాడారు. రాయలసీమలో కరువు అనేమాట లేకుండా చేయడం మనందరి సంకల్పం కావాలని సీఎం పిలుపునిచ్చారు.

ఐదేళ్లలో మొత్తం రాష్ట్రంలో రూ.69 వేల కోట్లు సాగునీటి ప్రాజెక్టులకు ఖర్చుపెట్టిన ఘనత తమదన్నారు. రైతాంగం మీద మమకారం ఉన్న ప్రభుత్వం తమదన్నారు. సముద్రంలోకి పోయే నీళ్లన్నీ రాయలసీమకు పంపిస్తే, అన్ని రిజర్వాయర్లు పూర్తైతే రాబోయే 5 సంవత్సరాలు కూడా కరువు అనేమాట లేకుండా ప్రణాళికలు తయారు చేసే బాధ్యత తమదేనన్నారు. రాయలసీమను రతనాల సీమగా తయారు చేస్తానని హామీ ఇచ్చారు.
ఈయన ఐదేళ్లు ఉన్నాడు, నేను ఆ పేరు కూడా చెప్పను, మీకు నచ్చిన పేరు పెట్టుకోవచ్చు అంటూ జగన్ పై చంద్రబాబు వ్యాఖ్యలు చేశారు. ఖర్చు పెట్టిన డబ్బులు చూస్తే.. రూ.19 వేల కోట్లు. రూ.69 వేల కోట్లు ఎక్కడ? రూ.19 వేల కోట్లు ఎక్కడ?. అప్పుడు బడ్జెట్ రూ.7 లక్షల కోట్లు ఐదేళ్లలో. ఇప్పుడు రూ.12 లక్షల కోట్లు. రూ.12 లక్షల కోట్లలో ఆయన పెట్టింది రూ.4,400 కోట్లు పెడితే మన హయాంలో రూ.13,600 కోట్లు సంవత్సరానికి ఖర్చు పెట్టాం. అదీ రైతాంగం మీద మన ప్రభుత్వం చిత్తశుద్ధి అని గుర్తుచేశారు.

మీరందరూ ఓట్లేశారు గానీ.. మీకు ఎన్నో హామీలు ఇచ్చాను చేయాలి, కానీ ఖజానా ఖాళీగా కనబడుతోంది ఏమీ లేదక్కడ అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు. కేంద్రంలో ఉండే ఎన్డీఏ ప్రభుత్వం ముందుకొచ్చి కలిసి పోటీ చేశాం కాబట్టి తనను అర్థం చేసుకున్నారని, అందుకే అందరినీ గెలిపించిన ఘనత ఈ తెలుగుజాతిది అన్నారు. దానివల్ల నిలదొక్కుకునే శక్తి వచ్చిందన్నారు.












Click it and Unblock the Notifications