విడినా మనమంతా ఒక్కటే: బాబు, మెచ్చుకున్నకేసీఆర్
హైదరాబాద్: టీడీపీ అధ్యక్షుడిగా రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నానని, తెలుగు వారు భౌగోళికంగా విడిపోయినా ప్రజలంతా కలిసి ఉండాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. ఆదివారం జలవిహార్లో సికింద్రాబాద్ ఎంపీ, బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ నిర్వహించిన అలయ్ బలయ్ కార్యక్రమంలో గవర్నర్ నరసింహన్, ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్ పాల్గొన్నారు.
ఈ సందర్బంగా చంద్రబాబు మాట్లాడారు. రెండు రాష్ట్రాల ప్రజలు కలిసి ఉండాలని కోరుకుంటున్నానని వ్యాఖ్యానించారు. తెలుగు వారు అంతా మానసికంగా ఎప్పుడు ఒక్కటే అన్నారు. ప్రజల అవసరాలు తీర్చేందుకు అందరు కలిసి నడవాలన్నారు. రెండు ప్రాంతాలు అభివృద్ధి చెందాల్సి ఉందన్నారు. అన్ని పార్టీల వారిని ఒకే వేదిక పైకి తేవడం ఆనందంగా ఉందన్నారు. అందరినీ ఒకే వేదిక పైకి తెచ్చే దత్తాత్రేయ ప్రయత్నం అభినందనీయమన్నారు.
అంతకుముందు కేసీఆర్ మాట్లాడుతూ.. దత్తాత్రేయకు దేవుడు నూరేళ్ల ఆయిష్షు ఇవ్వాలని, ఆయన అలయ్ బలయ్ కార్యక్రమాలలో తాను ఎప్పుడు పాల్గొనాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. అలయ్ బలయ్ సృష్టికర్త దత్తాత్రేయే అన్నారు. పార్టీలు, మతాలకు, రాజకీయాలకు అతీతంగా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారని కొనియాడారు. అలయ్ బలయ్ నిర్వహించడం అభినందనీయమన్నారు.