ముళ్లకంపపై కూర్చున్నారు: కోడెలపై బాబు
హైదరాబాద్: ప్రస్తుతం జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో వాగ్వాదాలు, విమర్శలు, వ్యంగ్యాస్త్రాలతోపాటు పలువురు నేతలు జోకులు కూడా పేలుస్తున్నారు. ఏపి సిఎం చంద్రబాబునాయుడు కూడా తన సుదీర్ఘ ప్రసంగంలో అవకాశం దొరికినప్పుడల్లా విపక్షంపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.
బుధవారం జరిగిన సమావేశాల్లో చంద్రబాబునాయుడు స్పీకర్ కోడెల శివప్రసాద్పైన కూడా ఓ జోక్ వేశారు. సభలో మానసిక రోగులున్నారని ఆయన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులనుద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేశారు.
ఇక్కడ తాను మహామహులతోపాటు 30ఏళ్లకు పైగా కూర్చున్నానని, ఇప్పుడు కూర్చోవాలంటే విసుగుపుడుతోందని అన్నారు. అంతేగాక, ‘నాకు తెలుసు అధ్యక్షా.. మీరు కూడా ముళ్లకంపపై కూర్చున్నారు' అని చంద్రబాబు అన్నారు.
కాగా, రెండు మూడుసార్లు చంద్రబాబు ‘మానసిక రోగులు' అన్న పదం వాడటంతో సభలో ఒక్కసారిగా గందరగోళం చెలరేగింది. ఆ తర్వాత వాయిదాలు పడుతూ సభ కొనసాగింది.