ఢిల్లీ స్క్రిప్టుతో జగన్, కెసిఆర్, బొత్స డ్రామా: చంద్రబాబు
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణలపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు విరుచుకుపడ్డారు. ఢిల్లీ రాసిచ్చిన స్క్రిప్టుతో ఈ ముగ్గురు నాయకులు డ్రామాలు ఆడుతున్నారని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు.
కెసిఆర్ హైదరాబాదులో సభ పెట్టాడని, జగన్ పెట్టబోతున్నాడని, ఈ ఇద్దరిని ఆడిస్తోంది కూడా కాంగ్రెసు పార్టీయేనని ఆయన అన్నారు. ఇరు ప్రాంతాల్లో ప్రజలను రెచ్చగొట్టి రాజకీయ ప్రయోజనం పొందాలని కాంగ్రెసు భావిస్తోందని ఆయన అన్నారు. ఎన్నికల తర్వాత వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కాంగ్రెసుతో కలిసిపోవడం ఖాయమని ఆయన అన్నారు. జగన్ ఎన్నో సార్లు యూటర్న్లు తీసుకున్నాడని, మాట మార్చాడని ఆయన అన్నారు. తెలంగాణ విషయంలో జగన్, ఆయన కుటుంబ సభ్యులు గతంలో ఏం మాట్లాడారో చంద్రబాబు చెప్పారు. సమైక్యాంధ్ర ముసుగులో సీమాంధ్ర విభజనకు జగన్ ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్శించారు.
తెలంగాణ పేరు చెప్పి కెసిఆర్ వసూళ్లు చేపట్టారని, బ్లాక్ మెయిల్ చేయాలని చూస్తున్నారని ఆయన అన్నారు. వైయస్ జగన్ నిజాయితీ గురించి మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. నదీ జలాలు రాష్ట్రానికి రాకపోవడానికి వైయస్ ప్రభుత్వమే కారణమని ఆయన అన్నారు. దేశంలో ధర్మం, నీతి బతికే ఉందని, అయితే గెలవడానికి ఆలస్యమవుతుందని, లాలూ ప్రసాద్ యాదవ్కు మరింత మందికి దాణా కుంభకోణంలో శిక్ష పడిందని, రషీద్ మసూద్కు శిక్ష పడిందని, వైయస్ జగన్ విషయంలో కూడా అదే జరుగుతుందని ఆయన అన్నారు.
కాంగ్రెసుతో కుమ్మక్కయితో 16 నెలలపాటు జైల్లో ఎందుకు ఉంటానని జగన్ అంటున్నాడని గుర్తు చేస్తూ పక్కాగా మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని, దానివల్లనే జగన్కు బెయిల్ వచ్చిందని ఆయన అన్నారు. సిబిఐ మాట మార్చి జగన్ కేసును నీరు గార్చిందని ఆయన విమర్శించారు. యుపిఎతో పొత్తు పెట్టుకుంటామని జగన్ సహా ఆయన కుటుంబ సభ్యులు పలు మార్లు చెప్పారని చంద్రబాబు గుర్తు చేశారు. సబ్బం హరి వాస్తవాలు చెప్పారని, దాంతో సబ్బం హరికి తమ పార్టీతో సంబంధం లేదని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ చెప్పిందని ఆయన అన్నారు.
వైయస్ విజయమ్మ, ఆమె కూతురు ఎన్నిసార్లు ఢిల్లీకి వెళ్లి వచ్చారు, ఎన్నిసార్లు లాలూచీ పడ్డారు చెప్పాలని ఆయన అన్నారు. కుమ్మక్కు కావడం వల్లనే చార్జిషీట్లకు విరుద్ధంగా సిబిఐ మెమో దాఖలు చేసిందని, ఇప్పుడు ప్రజలను మభ్య పెట్టడానికి చూస్తున్నారని చంద్రబాబు అన్నారు. జగన్ దోషిగా తేలుతాడు, పార్టీ మనుగడ ప్రమాదంలో పడుతుందని తెలిసి డ్రామాలు ఆడారని ఆయన విమర్శించారు. తెలంగాణపై సిడబ్ల్యుసి నిర్ణయానికి ముందే తమకు సంకేతాలు అందాయని విజయమ్మ చెప్పారని, కాంగ్రెసు అధిష్టానం నుంచే ఆ సంకేతాలు అందాయని ఆయన అన్నారు.
రాజీనామాలను ఆమోదింపజేసుకుంటామని చెప్పిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులు ఇప్పుడు సమైక్యాంధ్ర తీర్మానం కోసం శాసనసభ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కొత్త నాటకం ప్రారంభించారని ఆయన అన్నారు. కాంగ్రెసు పార్టీ నాయకులు రాజకీయ ప్రయోజనం కోసం ఇరు ప్రాంతాల ప్రజలను రెచ్చగొట్టడానికి కెసిఆర్, జగన్, బొత్సలతో నాటకాలు ఆడిస్తోందని ఆయన అన్నారు. జగన్ పెద్ద పోరాట యోధుడిలా మాట్లాడుతూ సమైక్యాంధ్రకు తొలి సంతకం తానే చేస్తానని అంటున్నాడని ఆయన ఎద్దేవా చేశారు. కాంగ్రెసు పార్టీ ఈ రాష్ట్రాన్ని తగులబెట్టిందని ఆయన అన్నారు.
తమ గురించి మాట్లాడే హక్కు కెసిఆర్కు లేదని, తెలంగాణను తామే అభివృద్ధి చేశామని, హైదరాబాదును ప్రపంచ చిత్రపటం మీద నిలిపింది తామేనని, రాజకీయ ప్రయోజనాల కోసమూ వసూళ్ల కోసం కెసిఆర్ మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. కెసిఆర్ గానీ జగన్ గానీ సోనియా గాంధీనీ రాహుల్ గాంధీని ఒక్క మాట అనడం లేదని, తమ పార్టీని లక్ష్యం చేసుకున్నారని ఆయన అన్నారు. కాంగ్రెసు, తెరాస, వైయస్సార్ కాంగ్రెసు పార్టీల నాటకాలను తాను ప్రజల ముందు పెడతానని, తమ పార్టీని వారు ఏం చేయలేరని ఆయన అన్నారు.