ఢిల్లీలో కాళ్లు మొక్కి! నాపై కాలు దువ్వుతారా? అడ్రస్ గల్లంతే: వైసీపీ, బీజేపీలపై బాబు ఆగ్రహం
అమరావతి: రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నాయంటూ కేంద్రంలోని బీజేపీ సర్కారు, రాష్ట్రంలోని ప్రతిపక్షం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అంతేగాక, తమకు అడ్డువస్తే వచ్చిన వారి అడ్రస్ గల్లంతవుతుందని స్పష్టం చేశారు.
తన నివాస ప్రాంగణంలో బుడగ జంగాలతో నిర్వహించిన సభలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. బుడగ జంగాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. బుడగజంగాల అన్ని సమస్యలను తీరుస్తానని చెప్పారు.
బాబూ! మీ ఎంపీలతో రాజీనామా చేయించు, కేసీఆర్లా కాదు: జగన్, 'కోడెల టాక్స్-టీఎస్టీ'
ఎస్సీలకు వచ్చే బెనిఫిట్లన్నీ ఇస్తామని హామీ ఇస్తున్నట్లు తెలిపారు. అంతేగాక, ఎస్సీ హాస్టళ్లలో బుడగజంగాల పిల్లల్ని చేర్పించడం జరుగుతుందని అన్నారు. శర్మ రిపోర్టు రాగానే సర్టిఫికేట్ కూడా ఇస్తామని అన్నారు. ప్రతి కుటుంబానికి నెలకు రూ.10వేలు ఆదాయం వచ్చే ఏర్పాటు చేశామని, రూ.30వేలకు పెరిగేలా చేస్తామని తెలిపారు.
అక్కడ కాళ్లు మొక్కి.. నాపై చిందులు
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వాళ్లు కేంద్రానికి కాళ్లకుమొక్కుతారని, తమపై కాలు దువ్వుతున్నారని చంద్రబాబు దుయ్యబట్టారు. ఇచ్చిన హామీలు నెరవేర్చమని అడిగితే తనపై నిందలు వేస్తున్నారని కేంద్రంపై మండిపడ్డారు. ఇది తన మీద దాడి కాదని రాష్ట్రం మీద చేస్తున్న దాడి అని అభిప్రాయపడ్డారు.
వాళ్లను క్షమించరాదు
రాష్ట్ర ద్రోహులకు ప్రజలు బుద్ధి చెప్పాలని, లాలూచీ రాజకీయాలు చేసే వారిని క్షమించరాదని అన్నారు. రాష్ట్ర అభివృద్ధికోసం బీజేపీతో పొత్తు పెట్టుకున్నామని వివరించారు. విభజన సమయానికి రాజధాని లేదని, పరిశ్రమలు లేవని అన్నారు. కేంద్రం సహకరించకపోయినా అభివృద్ధి చేశామని తెలిపారు.
కేంద్రానికి వైసీపీ సరెండర్
పేదల కోసం గట్టిగా కేంద్రాన్ని అడగాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే వదిలిపెట్టే సమస్యే లేదని స్పష్టం చేశారు. రాష్ట్రంపై అనేక కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. కేసుల మాఫీ కోసం వైసీపీ కేంద్రానికి సరెండర్ అయ్యిందని విమర్శించారు. ఎన్ని శక్తులు అడ్డు వచ్చినా అభివృద్ధి ఆగదని స్పష్టం చేశారు. కేంద్రం దయాదాక్షణ్యాలు తమకు అవసరం లేదని చంద్రబాబు అన్నారు.
వైసీపీని ఎవరూ నమ్మరు
పార్లమెంటులో పీఎం ఆఫీసు చుట్టూ తిరుగుతూ.. బయటికి వచ్చి అవిశ్వాసం పెడతామంటున్నారని మండిపడ్డారు. వైసీపీని ఎవరూ నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు. ఎన్టీఆర్ తెలుగు ప్రజలకు ఆత్మగౌరవం ఇస్తే.. తాను ఆత్మ విశ్వాసం ఇచ్చానని చంద్రబాబు తెలిపారు. రాజకీయాలు చేయొచ్చు కానీ, లాలూచీ రాజకీయాలు వద్దని అన్నారు. నాయకులకు విలువలు ఉండాలని, స్వార్థ ప్రయోజనాల కోసం పాకులాడకూడదని చంద్రబాబు అన్నారు.
నిప్పులా బతికా.. అలా చేయొద్దు
రాజకీయాలు చేయొచ్చు గానీ, రాష్ట్ర ప్రయోజనాలను అడ్డుకోవద్దని తేల్చి చెప్పారు. రాష్ట్ర విభజన తర్వాత క్లిష్ట పరిస్థితుల్లో తాను తప్ప ఎవరూ రాష్ట్రాన్ని కాపాడలేరని తనకు ప్రజలు ఓట్లు వేశారని చంద్రబాబు అన్నారు. అందుకే నాలుగేళ్లుగా రాత్రింబవళ్లు కష్టపడినట్లు చెప్పారు. ఇంకా కష్టపడతానని చెప్పారు. తన రాజకీయ జీవితంలో తనను ఎవరూ వేలెత్తి చూపలేదని అన్నారు. తనపై ఎన్నో ఎంక్వైరీలు వేశారని, అయినా ఏమీ చేయలేకపోయారని చెప్పారు. తాను నిప్పులా బతుకుతున్నానని అన్నారు. రాష్ట్ర ద్రోహులకు బుద్ధి చెప్పాలని అన్నారు.