రోజా ఎలా తిట్టారో చూశారుగా, నాపైకి దూసుకొచ్చారు, అందుకే ఊరుకున్నా: బాబు
కర్నూలు: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు సభలో తనను కాల్ మనీ సీఎం, కామ సీఎం అంటూ తిట్టారని, అయినప్పటికీ తాము సంయమనం పాటించామని ముఖ్యమంత్రి చంద్రబాబు పరోక్షంగా రోజాను ఉద్దేశించి అన్నారు. కర్నూలు జిల్లా దీబగుంట్లలో జన్మభూమి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు.
కాల్ మనీ విషయమై చర్చకు వచ్చినప్పుడు ఓ ముఖ్యమంత్రి పైన విపక్ష సభ్యులు దారుణంగా మాట్లాడారన్నారు. ఓ ఎమ్మెల్యే (టిడిపి ఎమ్మెల్యే వనిత) గురించి వైసిపి ఎమ్మెల్యే (రోజా) అసెంబ్లీలో మాట్లాడిన తీరును ప్రజలు చూశారన్నారు. అలాంటి వారిని ఎలా అంగీకరిస్తామని అభిప్రాయపడ్డారు.
నేర చరిత్ర ఉన్నవాళ్లు చెబితే నేను వినవలసి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. సభలో ప్రతిపక్షం గొడవ చేస్తున్నా సంయమనం పాటించామన్నారు. నన్ను ఎవ్వరూ బెదిరించలేరని, బ్లాక్ మెయిల్ చేయలేన్నారు. మొండి వాళ్లకు జగమొండిని అన్నారు. మంచివాళ్లకు మంచివాడినన్నారు.
వాళ్లు తనను కాల్ చంద్రబాబు, కామ చంద్రబాబు తిట్టారని, నేను కూడా వారిలా చేస్తే అసెంబ్లీ రసాభాస అవుతుందన్నారు. అందుకే తాము మౌనం వహించామన్నారు. చెడ్డవాళ్లకు చట్ట పరిధిలో శిక్షలు తప్పవని హెచ్చరించారు.
హత్యలు, దోపిడీ చేసేవాళ్ల వల్లే రాయలసీమ వెనుకబడిందన్నారు. రాయలసీమకు అన్యాయం జరగదని, అగ్రభాగాన నిలబెడతానన్నారు. పదవులు పోయిన తర్వాత కొందరికి రాయలసీమ వెనుకబాటుతనం గుర్తుకు వచ్చిందని ఎద్దేవా చేశారు.
ఫిబ్రవరి నెల నుంచి అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో పరీక్షలను ఉచితం చేస్తామన్నారు. 22.5 మిలియన్ యూనిట్ల విద్యుత్ కొరత నుంచి 24 గంటల విద్యుత్ సరఫరా వైపు దూసుకెళ్తున్నామన్నారు. నిర్భాగ్యులకు పెద్దకొడుకుగా ఉంటానని చెప్పారు. పదేళ్ల పాటు రాష్ట్రాన్ని కాంగ్రెస్ భ్రష్టు పట్టించిందని, దానిని సరి చేస్తున్నానని చెప్పారు.
ఏడాది పాటు కష్టపడితే దీబగుంట్ల స్మార్ట్ గ్రామంగా మారుతుందన్నారు. గ్రామానికి వచ్చిన అధికారులను అడ్డుకోవడం తప్పని చంద్రబాబు అన్నారు. అధికారులు వచ్చింది మీ కోసమేనని ప్రజలను ఉద్దేశించి చెప్పారు. మీ సమస్యను ఆన్ లైన్ ద్వారా చెప్పుకోవచ్చన్నారు.
అధికారులను అడ్డుకోవద్దన్నారు. నేను లేదా తమ ప్రభుత్వం రాజకీయ పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేస్తానని చెప్పారు. అయితే, మీరు (ప్రజలు) మాత్రం ఏ పార్టీకి అండగా ఉంటే అభివృద్ధి జరుగుతుందో ఆలోచించాలన్నారు. నేరమయ చరిత్ర ఉన్న పార్టీ వైపు ఉంటారా అని ప్రశ్నించారు.
రాయలసీమను ఇండస్ట్రియల్ జోన్గా అభివృద్ధి చేస్తామన్నారు. పేదలకు సంక్షేమ పథకాలతో పాటు ఆదాయ మార్గాలు చూపిస్తామన్నారు. దీబగుంట్ల గ్రామంలో వంద శాతం మరుగుదొడ్లు, ఇళ్లు నిర్మించి ఇస్తామని చంద్రబాబు చెప్పారు. సంక్రాంతి రోజున నెయ్యితో భోజనం చేసేందుకు కానుక ఇస్తున్నానన్నారు.
అధికారులనే గ్రామాలకు వచ్చేలా చేసింది తెలుగుదేశం ప్రభుతవం అన్నారు. పంటలు ఎండిపోకుండా పంట సంజీవిని ద్వారా కాపాడుతామన్నారు. వర్షపు నీటిని భూగర్భ జలంగా మార్చుకుందామన్నారు. నదుల అనుసంధానంతో నీటి సమస్య తగ్గించుకుందామన్నారు. గ్రామస్థులు అధికారులను అడ్డుకోవద్దన్నారు.
భూవివాదాన్ని సృష్టించింది రెవెన్యూ ఉద్యోగులే అన్నారు. రాష్ట్రాన్ని కరవురహిత రాష్ట్రంగా మార్చాలని, రాయలసీమను రతనాల సీమగా మార్చాలన్నదే తన లక్ష్యమన్నారు. నంద్యాలను దేశానికి విత్తన కేంద్రంగా తయారు చేస్తామన్నారు. అభివృద్ధి, సంక్షేమంలో రాజకీయం వద్దన్నారు.