రాజకీయాలు లాస్ట్, ఇది మంచిది కాదు: చంద్రబాబు
హైదరాబాద్: నేటి యువత రాజకీయాలను లాస్ట్ ఛాయిస్గా చెబుతున్నారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు బుధవారం అన్నారు. బుధవారం హైదరాబాద్లోని నొవాటెల్లో జరిగిన నారా రోహిత్ 'ప్రతినిధి' ఆడియో వేడుకలో ఆయన పాల్గొని తొలి సిడిని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడారు.
భవిష్యత్తులో మీరు ఏం కావాలని కోరుకుంటున్నారు? అని యువతను అడిగితే డాక్టర్లు, ఇంజనీర్లు, సినిమా యాక్టర్లు కావాలనుకుంటున్నామని చెప్తున్నారు. కానీ రాజకీయాల్లోకి వస్తానని ఎవరూ చెప్పట్లేదు. రాజకీయం వారి లాస్ట్ చాయిస్ అవుతోంది. యువతలో రాజకీయాల పట్ల ఇంత అసంతృప్తితో ఉండటం మంచిది కాదు. రాజకీయాల్లో విలువలు పుంజుకోవాలి. రాజకీయ ప్రక్షాళన జరిగితే, యువతకు రాజకీయాల పట్ల ఉత్సాహం పెరుగుతుందని బాబు అన్నారు.

సమాజంలోని సమస్యల్ని ప్రశ్నిస్తూ తీసిన ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని చంద్రబాబు ఆకాంక్షించారు. మధ్య తరగతిలో పుట్టినా మన ప్రజాస్వామ్యం గొప్పదనం వల్ల మనం ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చునన్నారు. తాను విశ్వవిద్యాలయంలో ఉండగానే రాజకీయాల్లో అడుగు పెట్టానని, సినిమాల్లోనూ, రాజకీయాల్లోనూ ఎన్టీఆర్కు ఆయనే పోటీ అన్నారు.
ఆయన కారణజన్ముడని, యువత ఆయనను ఆదర్శంగా స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. ఈ సినిమాలో 'వందేమాతరం' పాట వింటే నూతనోత్తేజం కలిగిందని, మన దేశాన్ని ప్రపంచంలోనే నెం.1 స్థాయిలో నిలిపే శక్తి యువత చేతిలో ఉందన్నారు. తానెప్పుడూ విలువలకు ప్రాధాన్యమిస్తానని, వ్యక్తి జీవితంలో ఒకటే పెళ్లి అనే విలువకు కట్టుబడి ఉంటానని, పాశ్చాత్యదేశాల్లో పెళ్లిళ్లు జరుగుతాయని, వారి నుంచి మనల్ని ప్రత్యేకంగా నిలబెట్టేది మన విలువలే అన్నారు.
ఆ విలువల్ని కాపాడటంలో ముందుంటానని చెప్పారు. మనదేశానికి సంపద కుటుంబ వ్యవస్థే అన్నారు. అలాంటి సంపదను ఆహ్వానించడంలోనూ ముందుంటానని చెప్పారు. టిడిపి హయాంలోనే హైదరాబాద్కు కొత్తహంగులు వచ్చాయని, సైబర్ సిటీ ఏర్పాటు చేశామన్నారు.












Click it and Unblock the Notifications