ఆ అంశంపై సమీక్ష అభ్యంతరకరం:ప్రధాని మోడీకి చంద్రబాబు లేఖ...
అమరావతి:రైతులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత విద్యుత్ పథకాన్ని కేంద్రం దెబ్బతీసే ప్రయత్నం చేస్తోందని ఆరోపిస్తూ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు లేఖ రాశారు.
అలాగే విద్యుత్ చట్టం- 2003 కు కేంద్రం సవరణ ప్రతిపాదించడంపైనా ఆయన తన లేఖలో అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది కూడా రాష్ట్రాలు ఉచిత విద్యుత్ ఇవ్వకుండా కేంద్రం ఒత్తిడి చేసేలా ఉందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. అలాగే 15వ ఆర్థిక సంఘం విధి విధానాల్లో పేర్కొన్న"జనాకర్షక పథకాలపై సమీక్ష" అనే అంశం అభ్యంతరకరమని చంద్రబాబు తన లేఖలో పేర్కొన్నారు.
ప్రధాని మోడీకి చంద్రబాబు రాసిన లేఖలో విద్యుత్ చట్టానికి సవరణలు చేయాలనే ప్రతిపాదనను విరమించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర నిర్ణయించే విధానం రైతుకు మేలు చేసేలా ఉండాలని ఆయన పేర్కొన్నారు. ఏపీలో వరి సాగు ఖర్చు హెక్టారుకు రూ.1.08లక్షలు అవుతోందని, క్వింటాలుకు రూ. 1702 సాగు ఖర్చు అవుతుందని వివరించారు.
రైతుకు సాగు ఖర్చు రూపాయి అయితే మద్దతు ధర కేవలనం 83 పైసలుగా ఉండటాన్ని ఆయన తప్పుబట్టారు. అలాగే వరితో పాటు అన్ని పంటలకు మద్దతు ధర నిర్ణయించాలని చంద్రబాబు సూచించారు. మరోవైపు పంటల బీమా నిబంధనల్లోనూ పలు మార్పులు అవసరమని చంద్రబాబు అభిప్రాయం వ్యక్తం చేశారు. రైతులు తమ దగ్గర తీసుకున్న రుణాల వివరాలను జాతీయ పంట బీమా పోర్టల్లో నమోదు చేయాలని బ్యాంకులకు విధించిన నిబంధనతో రైతులకు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని చంద్రబాబు ప్రధాని మోడీ దృష్టికి తీసుకెళ్లారు.