వరదలపై ఏపీ సీఎస్ కు చంద్రబాబు లేఖ; ప్రభుత్వ వైఫల్యాలను ఏకరువు పెట్టిన మాజీ సీఎం!!
ఏపీ మాజీ సీఎం, టిడిపి అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాజా వరద పరిస్థితులపై ఏపీ సిఎస్ సమీర్ శర్మకు లేఖ రాశారు. ఇటీవల రాయలసీమలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన చంద్రబాబు, అక్కడ క్షేత్రస్థాయిలో పరిస్థితులను తెలుసుకున్నారు. వర్షాలు, వరదల కారణంగా చాలా గ్రామాలు ముంపుకు గురి కావడానికి మానవ తప్పిదమే కారణమని ఆయన పేర్కొన్నారు. వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినప్పటికీ, ముందు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఇంత నష్టం జరిగిందని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే వరదలు ముంచెత్తాయని, అపార ప్రాణ నష్టంతో పాటు, ఆస్తి నష్టం సంభవించిందని పేర్కొన్న చంద్రబాబు, వరదల్లో ప్రభుత్వ వైఫల్యంపై న్యాయ విచారణ చేయాలని డిమాండ్ చేశారు.

వరదలపై సీఎస్ సమీర్ శర్మకు చంద్రబాబు లేఖ .. ఫభుత్వ వైఫల్యంపై న్యాయ విచారణ డిమాండ్
ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా ఏపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మకు లేఖ రాసిన చంద్రబాబు వరదల్లో ప్రభుత్వ వైఫల్యంపై న్యాయ విచారణ చేయాలని పేర్కొన్నారు. ప్రభుత్వ అంచనాల ప్రకారం 6054 కోట్ల రూపాయల నష్టం వాటిల్లితే, కేవలం 35 కోట్ల నిధులను మాత్రమే విడుదల చేయడం సరైన పద్ధతి కాదని చంద్రబాబు ఈ లేఖలో పేర్కొన్నారు. అంతేకాదు ప్రకృతి వైపరీత్యాల కోసం ఖర్చు పెట్టాల్సిన పదకొండు వందల కోట్ల రూపాయల నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్ళించిందని కాగ్ కూడా తప్పు పట్టిందని చంద్రబాబు ఈ లేఖలో పేర్కొన్నారు.

అన్నమయ్య ప్రాజెక్ట్ కొట్టుకుపోవటం, తిరుపతి మునిగిపోవటం అధికారుల నిర్లక్ష్యం వల్లే
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జాతీయ ప్రకృతి విపత్తు నిర్వహణ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు చంద్రబాబు. అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోవడం అధికారుల నిర్లక్ష్యం కారణంగానే అంటూ లేఖలో పేర్కొన్నారు. తిరుపతి నగరాన్ని వరదలు ముంచెత్తటానికి కారణం తుమ్మలగుంట చెరువుల ఆటస్థలంగా మార్చడం అని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు. కేవలం అధికారుల నిర్లక్ష్యం, ప్రభుత్వ వైఫల్యం వల్లనే వరదల్లో ఇంతగా ప్రజలు నష్టపోయారని పేర్కొన్న చంద్రబాబు అధికారుల నిర్లక్ష్యంపై న్యాయ విచారణ జరిపించాలని లేఖ ద్వారా డిమాండ్ చేశారు.

చనిపోయిన వారి కుటుంబాలకు 25 లక్షల పరిహారం, బాధిత కుటుంబాలకు 2 లక్షల పరిహారం డిమాండ్
వరదల్లో చనిపోయిన వారి కుటుంబాలకు 25 లక్షల రూపాయల పరిహారాన్ని, మిగిలిన బాధిత కుటుంబాలకు 2 లక్షల రూపాయల పరిహారాన్ని చెల్లించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. వరదల కారణంగా ఇళ్ళు కోల్పోయిన వారికి ఇళ్ళు కట్టివ్వాలని చంద్రబాబు స్పష్టం చేశారు. కడప, చిత్తూరు, నెల్లూరు, అనంతపురం జిల్లాలలో వరద కారణంగా ప్రాణ నష్టం,అపార ఆస్తినష్టం, పంట నష్టం సంభవించాయని చంద్రబాబు లేఖలో స్పష్టం చేశారు. విద్యుత్ కమ్యూనికేషన్ వ్యవస్థ దారుణంగా దెబ్బతిందని, రోడ్లు వంతెనలు కొట్టుకుపోయాయని వాటిని పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.

వరద ప్రభావం తగ్గినా.. తినటానికి తిండి లేక అవస్థలు పడుతున్న ప్రజలు
వరద ప్రభావం తగ్గి ఇన్ని రోజులైనా ఇంకా ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని, ప్రజల కష్టాలు చూస్తే తీవ్ర ఆవేదన కలుగుతుందని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు. ఇప్పటికీ బాధితులు తినడానికి తిండి లేక, ఉండటానికి వసతి లేక రోడ్ల మీదే ఉన్నారని అక్కడ ప్రజల పరిస్థితి దుర్భరంగా ఉందని చంద్రబాబు సిఎస్ సమీర్ శర్మకు రాసిన లేఖలో స్పష్టం చేశారు. అధికార యంత్రాంగం వైఫల్యంపై న్యాయ విచారణ జరిపించాలని చంద్రబాబు సిఎస్ సమీర్ శర్మ ను కోరారు.












Click it and Unblock the Notifications