జగన్ కు చంద్రబాబు మాస్టర్ స్ట్రోక్.. యాక్షన్ ప్లాన్ రెడీ!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత గత వైసీపీ హయాంలో జరిగిన అక్రమాలపై దృష్టి సారించారు. తాజాగా ఏపీలో వైసీపీ హయాంలో జరిగిన భూ ఆక్రమణలపై ఫోకస్ చేస్తున్న చంద్రబాబు జగన్ కు మరో మాస్టర్ స్ట్రోక్ ఇవ్వనున్నారు. ఈనెల 15నుండి వచ్చే నెల 30వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ సదస్సులకు శ్రీకారం చుట్టారు. ప్రజల భూ సమస్యలను రెవెన్యూ సదస్సుల ద్వారా పరిష్కారం చేయనున్నారు.
ఆగస్ట్ 15 నుండి సెప్టెంబర్ 30 వరకు రెవెన్యూ సదస్సులు
రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్ట్ 15 నుండి సెప్టెంబర్ 30 వరకు రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తామని రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ర్టేషన్స్ అండ్ స్టాంప్స్ శాఖా మంత్రి అనగాని సత్య ప్రసాద్ తెలిపారు. ఈ నెల 15వ తేదీన లాంఛనంగా ప్రారంభయ్యే రెవిన్యూ సదస్సులను ప్రతి గ్రామంలోనూ నిర్వహిస్తామని మంత్రి చెప్పారు. జగన్ హయాంలో వైసీపీ నేతలు భూ ఆక్రమణలకు పాల్పడ్డారని పేర్కొన్నారు.

22 ఏ సెక్షన్ ను వైసీపీ నేతలు దుర్వినియోగం చేశారు
గతంలోని వైసీపీ ప్రభుత్వ దోపిడి, దుర్మార్గపు చర్యల కారణంగా భూ సంబంధ సమస్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు, తనకు రోజుకు వేల కొద్ది అర్జీలు వస్తున్నాయని చెప్పారు. వైసీపీ నేతలు తమ భూములను ఆక్రమించారంటూ రాష్ట్రంలోని నలుమూల నుండి ప్రజల నుండి ఫిర్యాదులు వచ్చాయన్నారు. 22 ఏ సెక్షన్ ను వైసీపీ నేతలు దుర్వినియోగం చేసి పెద్ద ఎత్తున భూ అక్రమాలకు పాల్పడ్డారని చెప్పారు.
ప్రతి గ్రామంలోనూ రెవెన్యూ సదస్సులు
రీ సర్వే పేరుతో తమ వారికి లాభం చేకూర్చేలా వైసీపీ నేతలు భూ రికార్డులను తారుమారు చేశారని ప్రతి రోజూ ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. వీటన్నింటికీ పరిష్కారం చూపేందుకు ప్రతి గ్రామంలోనూ రెవెన్యూ సదస్సులు జరపాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు పెద్ద రెవెన్యూ గ్రామాల్లో రోజంతా, చిన్న రెవెన్యూ గ్రామాల్లో సగం రోజు సదస్సులు నిర్వహిస్తామని చెప్పారు.
అవసరమైతే క్షేత్రస్థాయిలో పర్యటించి విచారణ
భూ ఆక్రమణలు, 22 ఏ భూముల అక్రమాలతోపాటు అన్ని రెవెన్యూ సంబంధిత సమస్యలపై అర్జీలు స్వీకరిస్తామని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ప్రతి గ్రామానికి తహశీల్దార్ తోపాటు ఏడుగురు అధికారులు వచ్చి ప్రజల నుండి అర్జీలను స్వీకరిస్తారని చెప్పారు. ప్రతి అర్జీని అన్లైన్ చేసి అవసరమైతే క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రతి సమస్యపైన విచారణ జరిపి ఏం చర్యలు తీసుకున్నామో ఫిర్యాదుదారులకు తెలియజేస్తామని చెప్పారు.
జగన్ హయాంలో జరిగిన భూముల దోపిడీ లెక్కలు తీసే ప్లాన్
ప్రతి రోజు ఉదయం 9 గంటలకే రెవెన్యూ సదస్సులు ప్రారంభమవుతాయని, ఏ గ్రామంలో ఎప్పుడు సదస్సులు నిర్వహిస్తారో ఈనెల 13వ తేదీ నాటికి షెడ్యూల్ రూపొందిస్తామని చెప్పారు. రెవెన్యూ సదస్సులపై గ్రామ గ్రామాన స్థానిక మీడియా, కరపత్రాలు, పోస్టర్లు ద్వారా పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తామని చెప్పారు. ప్రజలు తమ భూ సంబంధిత సమస్యలపై రెవెన్యూ సదస్సులలో అర్జీలు ఇవ్వొచ్చని పేర్కొన్నారు. ఈ సదస్సుల ద్వారా జగన్ హయాంలో జరిగిన భూముల దోపిడీ లెక్కలు తీసే యోచనలో ఉన్నారు చంద్రబాబు. అందుకే ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారు.












Click it and Unblock the Notifications