చంద్రబాబు ప్రతిపక్ష హోదా ఫసక్ : ముహూర్తం ఖరారు: కానీ, వైసీపీలో కొత్త భయం..!
అమరావతి: టీడీపీ అధినేత..ప్రతిపక్ష నేత చంద్రబాబు సంక్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. 2019 ఎన్నికల్లో ఊహించని ఫలితాలతో ప్రతిపక్ష హోదాకే పరిమితమైన టీడీపీ లో ఇప్పుడు వలసలు భారీగా సాగుతున్నాయి. ఇక, చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా లేకుండా చేయాలంటే తమకు పెద్ద కష్టం కాదని..కానీ, తామే నియంత్రణతో ఉన్నామంటూ ముఖ్యమంత్రి జగన్ స్వయంగా శాసనసభలో వెల్లడించారు.
ఇక, ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో అనేక మంది నేతలు వైసీపీ బాట పట్టారు. ఇక, తాజాగా కరణం సైతం వల్లభనేని వంశీ,మద్దాలి గిరి రూటులోనే వైసీపీకి దగ్గరయ్యారు. వారు అధికారికంగా వైసీపీలో చేరకపోయినా టీడీపీకి మాత్రం దూరమైనట్లే. ఇదే సమయంలో మరి కొంత మంది టీడీపీ ఎమ్మెల్యేలను వైసీపీ ట్రాప్ చేస్తోంది. దీని ద్వారా చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా సైతం లేకుండా చేయాలనే పట్టుదలతో..ముహూర్తం సైతం ఖరారు చేసింది. అదే సమయంలో మరో భయం కూడా వెంటాడుతోంది.

ప్రతిపక్ష హోదా లేకుండా చేయాలంటే..
టీడీపీ నుండి 2019 ఎన్నికల్లో మొత్తం 23 మంది ఎమ్మెల్యేలు ఎన్నికయ్యారు. అందులో వల్లభనేని వంశీ..మద్దాలి గిరి..కరణం బలరాం టీడీపీని వీడారు. వారు ముగ్గురు తమ నియోజకవర్గాల డెవలప్ మెంట్ కోసమే ముఖ్యమంత్రిని కలిశామని చెబుతున్నారు. వంశీ ఇప్పటికే తనను టీడీపీ సభ్యుడిగా కాకుండా..స్వతంత్ర సభ్యుడిగా గుర్తించాలని స్పీకర్ ను కోరటంతో...ఆయనకు అసెంబ్లీలో టీడీపీ బెంచ్ ల్లో కాకుండా మరో చోట సీటు కేటాయించారు. ఇక, ఈ నెల 28వ తేదీ నుండి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇక, ప్రతిపక్ష నేతగా హోదా కొనసాగాలంటే మొత్తం సభలోని సభ్యుల సంఖ్యలో పదో శాతం తగ్గకుండా సభ్యుల మద్దతు ఉండాలి.

మరో ముగ్గురు దూరమైతే..
టీడీపీ నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచిన వంశీ, గిరి, కరణం బలరాంలు దూరం కావటంతో ఇప్పుడు సభలో టీడీపీ వాస్తవ బలం 20కి చేరింది. మరో ముగ్గురు సభ్యులు ఇదే తరహాలో దూరమైతే చంద్రబాబుకు ప్రతిపక్ష నేత హోదా దక్కదు. ఇప్పటికే పలువురు టీడీపీ సభ్యులు తమతో టచ్ లో ఉన్నారని చెబుతున్న వైసీపీ..వచ్చే వారంలో మరో నలుగురిని తమ వైపు తిప్పుకోవటానికి రంగం సిద్దం చేసింది. అదే చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా లేకుండా చేయటానికి ప్రయత్నాలు సాగుతున్నాయి. అయితే, వారు టీడీపీని వీడినా వంశీ తరహాలో స్వతంత్ర సభ్యులుగా స్పీకర్ గుర్తిస్తేనే సాధ్యం అవుతుంది.

వైసీపీని వెంటాడుతున్న ఆ భయం..
చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా లేకుండా చేయటం ద్వారా..ఆయనకు ప్రస్తుతం కొనసాగిస్తున్న కేబినెట్ హోదా రద్దవుతుంది. అదే విధంగా ఆయనకు దక్కాల్సిన ఇతర సౌకర్యాల విషయంలోనూ కోత పడుతుంది. అయితే, ఇదే సమయంలో వైసీపీలో మరో భయం కూడా వెంటాడుతోంది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వైసీపీ నుండి 23 మంది ఎమ్మెల్యేలను తమ పార్టీలోకి చేర్చుకొని.. ఏకంగా అందులో నలుగురికి మంత్రి పదవులు ఇవ్వటం ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత తీసుకొచ్చింది. తాను ఫిరాయింపులను ప్రోత్సహించనని..ఎవరైనా తమ పదవులకు...పార్టీకి రాజీనామా చేసిన తరువాతనే వైసీపీలో చేర్చు కుంటామని శాసనసభా వేదికగా ముఖ్యమంత్రి ప్రకటించారు.
Recommended Video


వైసీపీలో చేరకపోయినా.. చేరినట్లుగానే భావించాలి
సాంకేతికంగా ప్రస్తుతం టీడీపీ నుండి వస్తున్న ఎమ్మెల్యేలు వైసీపీలో చేరకపోయినా.. వారు వైసీపీలో చేరినట్లుగానే భావించాల్సి ఉంటుంది. దీని ద్వారా ప్రజల్లో తమ మీద వ్యతిరేక భావ ఏర్పడటానికి అదే సమయంలో చంద్రబాబు మీద సానుభూతి తీసుకొచ్చే అవకాశం ఉంటుందనే చర్చ సైతం పార్టీలో మొదలైంది. దీంతో..ఎమ్మెల్యేలను తామె దగ్గరకు తీసుకున్నా..చంద్రబాబు ప్రతిపక్ష హోదా రద్దు డిమాండ్ తమంతటగా తాము చేయకూడదని వైసీపీ భావిస్తోంది. నైతికంగానే చంద్రబాబు మీద ఆయనంతటగా ఆయన తన హోదా వదులుకొనేలా వ్యూహం అమలు చేయాలని భావిస్తోంది. ఈ మొత్తం వ్యవహారానికి ఏప్రిల్ లో జరిగే రెండో దశ బడ్జెట్ సమావేశాలు వేదిక అయ్యే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications