పనిలో పనిగా బాబు 'ప్రత్యేక' ప్లాన్: రేపు చత్తీస్గఢ్కు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకోసం ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహకారాన్ని కూడా తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. ముందుగా చత్తీస్గఢ్, ఒడిశా ముఖ్యమంత్రుల మాట సాయం తీసుకోవాలని భావిస్తున్నారు.
ఇందులో భాగంగా చంద్రబాబు సోమవారం చత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్కు వెళ్లనున్నారు. పోలవరం ప్రాజెక్టు సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకునేందుకు ఆ రాష్ట్రాల్లో రెండు రోజులపాటు ముఖ్యమంత్రి పర్యటిస్తున్నారు. విభజన కారణంగా తలెత్తిన సమస్యలను కూడా ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పంచుకోవాలని భావిస్తున్నారు.

ప్రధానంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించే అంశంలో ఉన్న అడ్డంకులను తొలగించేందుకు, రాష్ట్రానికి ఎక్కువ నిధులు వచ్చేలా చూసేందుకు తాను చేస్తున్న ప్రయత్నాలను చత్తీస్గఢ్, ఒడిశా ముఖ్యమంత్రులకు వివరించాలని చంద్రబాబు భావిస్తున్నారు. ప్రత్యేక హోదాపై కొన్ని రాష్ట్రాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నట్లు జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాల్సిన పరిస్థితి నెలకొంది.
కేవలం మన రాష్ట్రం తరఫున మాత్రమే ప్రయత్నించడం కన్నా, ఇతర రాష్ట్రాల సహాయం తీసుకోవడం కూడా మంచిదన్న భావనలో చంద్రబాబు ఉన్నారు. పోలవరం ప్రాజెక్టు సమస్యల పరిష్కారం కోసం రెండు రాష్ట్రాల్లో పర్యటించనున్న చంద్రబాబు ప్రత్యేక హోదాపై కూడా అక్కడి ముఖ్యమంత్రులతో చర్చించనున్నారు. అదే సమయంలో నయా రాయ్పూర్ రాజధాని నిర్మాణాన్ని పరిశీలిస్తారు.












Click it and Unblock the Notifications