లేఖలు రాసినా స్పందనలేదు: ప్రణబ్కు బాబు ఫిర్యాదు
వివిధ ఐకాసలు, పౌర సమాజ సంస్థలు, సమస్యతో ముడిపడి ఉన్న ఇతర వర్గాలతో వెంటనే చర్చలు జరపాల్సిన అవసరం ఉందని రాష్ట్రపతి దృష్టికి తెచ్చారు. రాష్ట్రంలో దిగజారిన పరిస్థితులపై ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్కు ఆగస్టు 9, 29 తేదీల్లో లేఖలు రాశానని, ఉద్యమిస్తున్న వర్గాల మధ్య సయోధ్య ఏర్పర్చాల్సిన అవసరాన్ని గుర్తు చేశానని, ఇప్పటిదాకా ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదన్నారు.
ఒక రాజనీతిజ్ఞుడిగా క్రియాశీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన ప్రధానమంత్రి 'ఆంటోనీ కమిటీకి చెప్పుకోండి' అని ఎన్జీవో నేతలకు సూచించడం అభ్యంతరకరమన్నారు. పార్టీ ఏర్పాటు చేసిన ఆంటోనీ కమిటీని ఇతరులెలా కలుస్తారని ఆయన ప్రశ్నించారు. అంటే విభజన వ్యవహారం కాంగ్రెస్ తన అంతర్గత సమస్యగా భావిస్తోందని అన్నారు. అభివృద్ది పథంలో ముందంజ వేస్తూ, శాంతియుత వాతావరణానికి పేరెన్నికగన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కేంద్రం అనుసరిస్తున్న వైఖరి వల్ల కనీవినీ ఎరగని రీతిలో నష్టపోయిందన్నారు. గత నాలుగుదేళ్లుగా అభివృద్ధి ఆగిపోయిందని చెప్పారు.
ఉపాధి అవకాశాలపై తీవ్ర ప్రభావం పడింది. టీఆర్ఎస్ను విలీనం చేసుకునేందుకు కాంగ్రెస్ రాజకీయ కుతంతాలు పన్నింది. వైసీపీ, కాంగ్రెస్ కూడా కుమ్మక్కయినట్లు ఆ పార్టీల వైఖరిని బట్టి తెలుస్తోంది'' అని చంద్రబాబు రాష్ట్రపతికి తెలిపారు. జగన్ అక్రమాస్తుల కేసులో సీబీఐ, ఈడీ దర్యాప్తు మందగించిందని తెలిపారు. ఈ కుమ్మక్కు వల్ల జగన్కు త్వరలో బెయిల్ కూడా వ స్తుందని అంటున్నారని చంద్రబాబు వివరించారు.
విభజన సమస్యను కాంగ్రెస్ తన సొంత రాజకీయ ప్రయోజనాలకోసం ఉపయోగించుకుంటోందని రాజ్యసభలో అన్ని రాజకీయ పార్టీలు విమర్శించినప్పుడు చిదంబరం నిర్లక్ష్యంగా, తప్పించుకునే ధోరణిలో సమాధానం ఇచ్చారని చంద్రబాబు ఫిర్యాదు చేశారు. షిండే, ఇతర కాంగ్రెస్ నేతలు పొంతనలేని ప్రకటనలు చేస్తూ మరింత అయోమయం సృష్టిస్తున్నారని రాష్ట్రపతికి తెలిపారు. అప్పట్లో సకల జనుల సమ్మె, ఇప్పుడు సీమాంధ్రలో ఉద్యోగుల సమ్మె గురించి వివరించారు.
ముఖ్యమంత్రి పనిచేయడం లేదు..
రాష్ట్రపతిని, బిజెపి, సిపిఎం నేతలను కలిసిన తర్వాత చంద్రబాబు విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి పని చేయడం లేదని, మంత్రులూ పని చేయడం లేదని, కాంగ్రెస్ తన స్వార్థ రాజకీయాలకోసం ప్రజలతో క్రూరపరిహాసం ఆడిందన్నారు. తాను రాజకీయాలు మాట్లాడడానికి, పొత్తుల గురించి చర్చించడానికి ఢిల్లీ రాలేదన్నారు. రాష్ట్రంలో నెలకొన్న దారుణమైన పరిస్థితిని జాతీయ స్థాయి నేతలకు వివరించేందుకే వచ్చానని తెలిపారు. జాతీయ స్థాయిలో తమ సంబంధాలను ఉపయోగించి రాష్ట్రంలో పరిస్థితిని చక్కదిద్దాలని బిజెపి, ఇతర పార్టీల నేతలను కోరానన్నారు.